Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరియా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన
బీరూట్: ప్రపంచీకరణ తాత్కాలికంగా పక్కకుపోయిన నేపథ్యంలో వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్థలో తీవ్రతరమవుతున్న వైరుధ్యాలే నేడు పెరుగుతున్న ఉద్రిక్తతలకు కారణమని ప్రపంచ రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తూ సిరియన్ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ బుధవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ఆర్థిక రంగంలో తలెత్తుతున్న ఉద్రిక్తతల్లో అమెరికా, చైనామధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం అతి ముఖ్యమైన పరిణామంగా అది పేర్కొంది. ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా వున్న ఈ రెండు దేశాలు తమ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఆజ్యం పోసేందుకు సుంకాల పెంపుదల, ఇతరుల దిగుమతులపై నిషేధం, పెట్టుబడులకు అడ్డంకులు, ప్రత్యర్థి మార్కెట్లను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వంటి వాటిని సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది. చైనాను అష్టదిగ్బంధనం చేసేందుకు దక్షిణాసియా, ఆగేయాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో అమెరికా సామ్రాజ్యవాద ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించింది. అయితే చైనా ఈ ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టడంతోపాటు అమెరికా కుట్రలను అడ్డుకోవడంలో చెప్పుకోదగిన విజయాలను సాధించిందని పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాద ప్రభుత్వం తన ఐరోపా మిత్ర దేశాలతో, ముఖ్యంగా బ్రిటన్, ఇజ్రాయిల్ వంటి వాటితో కలిసి ఇరాన్ను దిగ్బంధించే యత్నాలు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్తో కుదుర్చుకున్న 'అణు ఒప్పందం నుంచి నిష్క్రమించిన తరువాత అమెరికా సామ్రాజ్యవాద ప్రభుత్వం ఆ దేశంపై అనేక ఆంక్షలను విధించిందని, దీనికి తోడు సైనిక పరమైన కవ్వింపు చర్యలకు ఒడిగట్టిందని విమర్శించింది. ఇటీవల ఇరాన్కు చెందిన చమురు వాహకనౌకను జిబ్రాల్టర్లో నిర్బంధించటం ఇందుకు ఒక ఉదాహరణ అని పేర్కొంది. ఇటువంటి దుందుడుకు చర్యలు ఆయా దేశాల మధ్య చిచ్చు పెట్టి యుద్ధానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ తదితర దేశాల పట్ల అనుసరిస్తున్న ఈ విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు సిరియా కమ్యూనిస్టు పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు, వలసవాద దేశాల కుట్రలను తిప్పికొట్టేందుకు తీవ్రంగా పోరాడుతున్న ఇరాన్ ప్రజలకు సిరియా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం ప్రకటించింది. అమెరికా సామ్రాజ్యవాద ప్రభుత్వం, దాని నాటో మిత్ర దేశాలు కొనసాగిస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వెనిజులా ప్రజలకు కూడా తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్టు పేర్కొంది.