Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : సౌదీలోని చమురు శుద్ధి కర్మాగారాలపై శనివారం జరిగిన డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఇరాన్ వెల్లడింది. బక్యాక్, ఖురైన్ చమురు కర్మాగారాలపై ఇరాన్ దాడులకు పాల్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ ట్విట్టర్లో స్పందించారు. సౌదీ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నప్పటికీ తమపై బురద చల్లేందుకు అమెరికా కుట్ర పన్నిందన్నారు. సౌదీ చమురు కర్మాగారాలపై ఇరాన్ దాడికి పాల్పడినట్టు అమెరికా వద్ద ఆధారాలుంటే చూపాలని జవాద్ డిమాండ్ చేశారు. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన అనంతరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దని మిత్రదేశాలను అమెరికా హెచ్చరించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై భారీ ఆంక్షలు మోపనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు ఇరాన్తో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. ఇరాన్ను ఒంటరి చేయాలనే కుట్రతో అరబ్బు దేశాల్లో జరుగుతున్న దాడులతో ఇరాన్కు సంబంధాలున్నాయని అసత్య ప్రచారం చేపడుతున్నది.