Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్కు తాలిబన్ల స్పష్టీకరణ
కాబూల్ : శాంతి చర్చలు తిరిగి ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తే అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని ఆఫ్ఘన్ తాలిబన్లు స్పష్టం చేశారు. తమ తరఫున శాంతి చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయని తాలిబన్ల ముఖ్య ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అఫ్ఘాన్లో శాంతి సాధనకు కేవలం చర్చలు ఒకటే మార్గమని అన్నారు. ఈనెల 7న కాబూల్ నగరంలో జరిపిన దాడిలో ఒక అమెరికన్ సైనికుడితో పాటు 11 మంది పౌరుల మరణానికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించటంతో శాంతి చర్చల నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. శాంతి చర్చలు అర్ధంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో అఫ్ఘాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకునేలా అమెరికాపై పెరుగుతున్న ఒత్తిడికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టే లక్ష్యంతో తాలిబన్లు తమ ప్రతినిధి వర్గాన్ని రష్యాకు పంపారు. అఫ్ఘనిస్తాన్లో దాదాపు 19 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకూ దాదాపు 2.2 లక్షల మందికి పైగా మృతి చెందగా, అమెరికన్ ఖజానాపై 97,500 కోట్ల డాలర్ల భారం పడినట్టు అమెరికన్ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.