Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఆయన భేటీ అవుతారని వైట్హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేత్రమైన అబ్ఖైఖ్తో పాటు ఖురైస్ చమురు శుద్ధి క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో చమురు శుద్ధి క్షేత్రాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రతీరోజు ఈ చమురు క్షేత్రాల్లో 57మిలియన్ బ్యారళ్ల చమురును శుద్ధి చేస్తారు. ఈ చమురు క్షేత్రాలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశముందని అంతర్జాతీయ చమురు సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఈ దాడులకు పాల్పడినట్టు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. అయితే, హౌతీ తిరుగుబాటుదారులకు డ్రోన్లు సరఫరా చేసింది ఇరానేని అమెరికా ఆరోపిస్తున్నది. సౌదీని దెబ్బతీసేందుకు ఈ దాడికి ఉసిగొల్పిందని ఆరోపించింది. సౌదీ మాత్రం ఇరాన్పై ఇంతవరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కాగా, సౌదీలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడులను మిత్రదేశమైన అమెరికా సీరియస్గా తీసుకోవడం గమనార్హం. 'ఈదాడికి పాల్పడ్డవారిపై ప్రతిదాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మందుగుండు సామాగ్రిని, క్షిపణులను లోడ్ చేసుకున్నాం' అని ఈ దాడి జరిగిన మరుసటి రోజు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్ పేరును మాత్రం ఆయన నేరుగా ప్రస్తావించకుండా ఈ ప్రకటన చేశారు. తానెవరిపై దాడికి పాల్పడలాని భావిస్తున్నారో మాత్రం వెల్లడించలేదు. ఐరాస సమావేశంలో ఈ దాడికి గురించి లేవనెత్తుతామని పాంపియో తెలిపారు.