Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేఏడాది వరకు హెచ్-4 వీసాలపై నిషేధం ఉండదు : అమెరికా
వాషింగ్టన్ : హెచ్-1 వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఊరట లభించింది. హెచ్-4 వీసాలపై వచ్చే ఏడాది వరకు నిషేధం విధించబోమని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హౌంల్యాండ్స్ విభాగం గురువారం వెల్లడించింది. అమెరికా తాజా నిర్ణయం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, హెచ్-4వీసాలపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నారు. 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్-1 వీసాదారుల జీవిత భాగస్వాములకు,పిల్లలకు హెచ్-4 వీసాల జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వీసాలపై అమెరికాకు వస్తున్న హెచ్-4 వీసాదారులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే, ఈవిధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. హెచ్-4 వీసాల జారీ కారణంగానే అమెరికాలో నిరుదోగ్య సమస్య తలెత్తిందని ఆరోపించారు. హెచ్-4 వీసాల వల్ల అమెరికా పౌరులకు ఏవిధంగా నష్టం వాటిల్లిందో వివరిస్తూ ఓ నివేదికను సిద్ధం చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ట్రంప్ ఆదేశించారు. అధికారుల నివేదిక ఆధారంగా హెచ్-4 వీసాలను పూర్తిగా రద్దు చేయాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై విమర్శలు వెల్లు వెత్తాయి. హెచ్-4 వీసాలు రద్దు చేసినట్టయితే భారత్ నుంచి అమెరికాకు వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గే అవకాశముంది. అంతేగాకుండా, అమెరికాలో పనిచేస్తున్న ప్రముఖ టెక్కీలు కూడా భారత్ నుంచి వచ్చిన వారే ఉన్నారు.
ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీలతో పాటు లేబర్పార్టీ పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. నైపుణ్యమున్న విదేశీయులకు ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ను కోరారు. గతేడాది 1,25,528 మంది భారతీ యులకు అమెరికా సర్కారు హెచ్-1బీ వీసాలు జారీ చేసింది. 2017లో 1,29,097 మంది భారతీయులు హెచ్-1 బీ వీసాలు పొందారని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. ఇదిలా ఉండగా, అమెరికాలో హెచ్-4వీసాల జారీ రద్దయినట్టయితే దీని ప్రభావం లక్ష మందిపై పడుతుంది. వీరిలో ఎక్కువగా నష్టపోయేది భారతీయులేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. గత ఐదేండ్లలో అమెరికా జారీ చేసిన హెచ్-1 బీ వీసాలు పొందినవారిలో 67 నుంచి 72 శాతం మంది భారతీయులే ఉన్నారని యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది.