Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా, సౌదీ దాడులను తిప్పిగొడతాం : ఇరాన్ విదేశాంగ మంత్రి
టెహ్రాన్ : అమెరికా, సౌదీ బెదిరింపులకు భయపడమని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ వెల్లడించారు. ఒకవేళ ఇరుదేశాలు తమపై దాడులకు పాల్పడినట్టయితే వెంటనే ప్రతిదాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాము ఏదేశంపై కూడా ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడమని జవాద్ స్పష్టం చేశారు. ' మాకు యుద్ధం చేయాలనే కోరిక లేదు. రెండు దేశాల మధ్య యుద్ధమే అనివార్యమైనట్టయితే దీని తదనంతరం చోటు చేసుకునే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
దీని వల్ల ఇరుదేశాలకూ నష్టం వాటిల్లుతుంది. అయితే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం. ఒకవేళ మా భూభాగంపై అమెరికా, మిత్రదేశమైన సౌదీ ఎలాంటి దాడులకు పాల్పడినా తిప్పిగొడతాం' అని జవాద్ అన్నారు. కాగా, సౌదీ అరేబియాలోని రెండు ప్రముఖ చమురు క్షేత్రాలపై గతవారం డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడుల్లో ఈరెండు క్షేత్రాలు బాగా దెబ్బతిన్నాయి. వీటిలో మంటలు చల్లారలేదు. ఈ క్షేత్రాల్లోని చమురు శుద్ధి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈనేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరో వారం రోజుల్లో మిన్నంటే అవకాశముందని అంతర్జాతీయ చమురు సంస్థలు పేర్కొన్నాయి. సౌదీలోని చమురు క్షేత్రాలపై ఇరానే దాడికి పాల్పడిందని సౌదీ మిత్రదేశమైన అమెరికా ఆరోపించింది.
కాగా, ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. ఇరాన్ నుంచి సరఫరా అవుతున్న డ్రోన్ల సాయంతో హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, అమెరికా ఆరోపణలపై మాత్రం ఇంత వరకు సౌదీ స్పందించలేదు. ఈ దాడులతో ఇరాన్కు సంబంధంలేదనే వాదనను మాత్రమే సౌదీ సమర్థిస్తున్నది. యెమెన్ తిరుగుబాటుదారులపై దాడులకు పాల్పడనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని సౌదీని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో ఇరాన్కు సంబంధాలున్నాయని సౌదీని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడులపై దర్యాప్తు చేపట్టేందుకు ఐరాస, ఫ్రాన్స్ ముందుకొచ్చాయి. దాడులు జరిగిన ప్రాంతానికి నిపుణులను పంపించి ఆధారాలు సేకరించనున్నట్టు తెలిపాయి.