Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: టెక్సాస్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు వరదలా ప్రవహిస్తోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహంలో పలు కార్లు కొట్టుకొనిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. వరదల్లో చిక్కుకొని ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. విమాన సర్వీసులను రద్దు చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హౌస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
'హౌడీ మోడీ' అనుమానమే...!
ఈ నెల 22న హోస్టన్లో ' హౌడీ మోడీ' సదస్సు జరగనుంది. హౌస్టన్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణ కష్టమేననే నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హౌస్టన్లో వరదలు పోటెత్తడంతో ప్రస్తుతం ఇక్కడ అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ' హౌడీ మోడీ' సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇంకా 50 వేల మంది ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. టెక్సాస్ గవర్నర్ రాష్ట్రంలో 13 కౌంటీల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మోడీ శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరి అమెరికాకు వెళ్లనున్నారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటిస్తారు. హోస్టన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుస్తారు. అలాగే డెమోక్రటిక్ నేతలతో కలిసి ఆయన ప్రసంగిస్తారు. 22న జరుగనున్న ఐరాస వాతావరణ సదస్సులో పాల్గొంటారు.