Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు
- నోబెల్ పురస్కారానికి థన్బర్గ్ నామినేట్
న్యూయార్క్ : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్ని సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్కు చెందిన 16ఏండ్ల థన్బర్గ్ అనేక బాలిక లేవనెత్తిన ఉద్యమం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె పిలుపునివ్వడంతో 150 దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో 3లక్షల మందికి పైగా పాల్గొన్నారని థన్బర్గ్ ట్వీట్ చేశారు. వైట్హౌస్ ముందు గతశుక్రవారం ఆమె నిరసన ప్రదర్శన చేపట్టింది. థన్బర్గ్ కృషిని గుర్తించిన నోబెల్ పురస్కార కమిటీ సభ్యులు ఆమె పేరును ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు.
పర్యావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనల వెల్లువెత్తుతోంది. ఐరాస వాతావరణ శిఖరాగ్ర సదస్సు సమావేశానికి ముందే దేశాధినేతలకు తమ నినాదాలు వినిపించేలా, వాతావరణ మార్పుల నుంచి రక్షణ కల్పించాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకారులు పిలుపునిచ్చారు. పర్యావరణంలో వస్తోన్న మార్పులకు పరిష్కారం చూపాలంటూ ప్రపంచం ఏకమై నినదిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ఇచ్చిన పిలుపుతో సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు 'గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్' పేరుతో 156 దేశాల ప్రజలు కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని ఆందోళనలు చేశారు. ఐరాస వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు ముందే తమ ఉద్దేశాన్ని దేశాధినేతలకు వినిపించేందుకు థన్బర్గ్ ప్రపంచవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తొలిరోజు నిర్వహించిన గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్లో విద్యార్థులు, పర్యావరణవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు ఆందోళనలు చేపట్టారు. వాతావరణ మార్పులు ఇదేవిధంగా కొనసాగినట్టయితే జీవించేందుకు మరొక గ్రహం కూడా లేదని ప్లకార్డులు చేతపట్టి, పది తలల రావణాసురుడి దిష్టిబొమ్మను ప్రదర్శించారు.
ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశంలో అధికంగా బొగ్గు, సహజ వాయువు ఎగుమతి ఉన్నందున గ్రీన్ హౌస్ తీవ్ర ప్రభావానికి గురవు తోందని గళమెత్తారు. వాయు ఉద్గారాలను వీలైనంత త్వరగా తగ్గించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాంకాంగ్ నగరంలోనూ వాతావరణ మార్పులపై నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. పర్యావరణం మార్పుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. చెక్ రిపబ్లిక్లో అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం విద్యార్థులు బంద్కు పిలుపునిస్తూ పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. కెన్యా రాజధాని నైరోబీలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను తమ తలలకు చుట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు.