Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసనకు సహకరించేది లేదని వైట్హౌస్ ప్రకటించింది. అభిశంసన ప్రతిపాదిస్తున్న సభ్యులు ఇప్పటివరకు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని తెలిపింది. న్యాయవాది పాట్ సిపోల్లోనె ఈ మేరకు డెమోక్రాటిక్ పార్టీ నేతలకు 8 పేజీల లేఖ రాశారు. 'అధ్యక్షుడు ఎలాంటి తప్పు చేయలేదన్న అంశం డెమోక్రాట్లకు తెలుసు. పూర్తి రాజకీయ కారణాలతో మాత్రమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే కోరికతో ఉన్నారు. ప్రతి అమెరికన్కు ఉన్న ప్రాథమిక హక్కును అభిశంసన ద్వారా ఉల్లంఘిస్తున్నారు.' అని వైట్హౌజ్ మీడియా కార్యదర్శి స్టెఫానీ గ్రీషమ్ అన్నారు. 2020అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసే జో బిడెన్పై అవినీతి ఆరోపణలు చేసి విచారణ ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశంపై ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అమెరికన్ ప్రతినిథుల సభ ట్రంప్పై అభిశంసన ప్రక్రియకు సిద్ధమైంది. అయితే, అభిశంసన ప్రక్రియలో పాల్గొనేందుకు అధికార యంత్రాంగానికి అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని డెమోక్రాట్లకు రాసిన లేఖలో శ్వేతసౌధం స్పష్టంచేసింది. అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో ఎలాంటి ఓటింగ్ చేపట్టలేదని లేఖలో గుర్తుచేసింది. కాబట్టి అభిశంసనకు రాజ్యాంగబద్దతలేదని పేర్కొంది. ఒక పత్రికా సమావేశం ఆధారంగా ఈ చర్యను చేపట్టడం సరికాదని లేఖలో విమర్శనాస్త్రాలు సంధించింది శ్వేతసౌధం. డెమోక్రాట్లు మాత్రం అభిశంసన ప్రక్రియ ప్రాథమిక దశలో ఓటింగ్ అవసరంలేదని, ఆధారాల సేకరణే ముఖ్యమని చెబుతున్నారు.