Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులపై లాఠీలు.. టియర్గ్యాస్ ప్రయోగం
- వర్సిటీలకు నిధులు కేటాయించాలంటూ భారీ ప్రదర్శన
- పోలీసుల దాడులను ఖండించిన విద్యార్థిలోకం
బొగోటా : పాలకులకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు జరిగితే.. వాటిపై ఉక్కుపాదం మోపటం సర్వసాధారణ మైపోయింది. తాజాగా కొలంబియాలో యూనివర్సిటీల నిర్వహణ కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనపై ఖాకీలు వీరంగం సృష్టించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. లాఠీలతో విద్యార్థులపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా బాష్పవాయువులు ప్రయోగించారు. పోలీసు బలగాలు జరిపిన ఈ దాడులపై విద్యార్థిలోకం ఖండించింది.
ఏం జరిగింది..?
విద్యావ్యవస్థను నీరుగార్చేలా ప్రభుత్వాలు యత్నిస్తూనే ఉన్నాయి. దీనికి విరుద్ధంగా.. కొలంబియాలోని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా ఆ దేశ రాజధాని బొగోటా వీధుల్లోకి వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. దీనికి మద్దతుగా అధ్యాపకులు కూడా వచ్చి మద్దతు తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు, బ్యానర్లతో మహా ప్రదర్శన నిర్వహించారు. వర్సిటీల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడిందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. అనేక యూనివర్సిటీలు అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. వర్సిటీల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించాలని డిమాండ్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ఐవాన్ డ్యూక్ తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. కాలీ, మెడెలిన్, బరాక్విల్లా నగరాల్లో తీసిన ర్యాలీలకు నేషనల్ యూనియన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ , కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ రిప్రెజెంటేటివ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంఘాలు నేతృత్వం వహించాయి. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా పాల్గొని వర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. బొగోటా నగరంలో ఊహించని విధంగా ప్రదర్శన తరలివస్తుండంతో..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో విద్యార్థులను బాదారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులకూ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. యూనివర్సిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం 23 మిలియన్ డాలర్లు ( రూ.163 కోట్లు ) కేటాయించనున్నట్టు ప్రకటించింది. అయితే, విద్యార్థులు మాత్రం 86 మిలియన్ డాలర్లు ( రూ.609 కోట్లు ) కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీల నిర్వహణ కోసం నిధుల మొత్తాన్ని పెంచేంత వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన కార్యక్రమాలపై కొలంబియా విద్యా శాఖ మంత్రి మరియా విక్టోరియా ఆంగ్యూలో స్పందించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తోందని హామీ ఇచ్చారు. విద్యార్థి సంఘాలతో సమాశమై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కొలంబియాలోని ఓ వర్సిటీలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుంది. అధికారుల అవినీతిని నిరసిస్తూ గతనెలలో విద్యార్థులు ఉద్యమించారు. క్రమక్రమంగా కొలంబియాలోని అన్ని వర్సిటీల విద్యార్థులు ప్రభుత్వ తీరుపై తిరుగుబావుటా ఎగురవేశారు.