Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా అధ్యక్షుడు జిన్పింగ్
బీజింగ్: చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. చైనా భూభాగాలను ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో పలు దేశాలు హాంగ్కాంగ్, తైవాన్లో నిరసన ప్రదర్శనలకు మద్దతిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చౌకబారు చర్యలు మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరోక్షంగా అమెరికా, మిత్రదేశాలను హెచ్చరించారు. హాంగ్కాంగ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విచారణ నిమిత్తం చైనాకు అప్పగించేందుకు తీసుకురావాలనుకున్న బిల్లును వ్యతిరేకిస్తూ హాంగ్కాంగ్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హాంగ్కాంగ్ సర్కారు ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓ వర్గానికి చెందిన ప్రజలు హాంగ్కాంగ్ చర్యలను సమర్థిస్తుండగా మరో వర్గం మాత్రం వ్యతిరేకిస్తోంది. ఈనేపథ్యంలో హాంగ్కాంగ్ నిరసనలతో అట్టుడుకుతోంది. మరోవైపు తైవాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇతర దేశాల జోక్యంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారాంతపు పర్యటనలో భాగంగా నేపాల్లో ఉన్న జిన్పింగ్ తరఫున చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ' చైనా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జునుజ్జు చేస్తాం. హాంగ్కాంగ్, తైవాన్లు తమ భూభాగానికి చెందినవి.' అని తెలిపింది.
నేపాల్కు చైనా భారీ సాయం
రానున్న రెండేండ్లలో నేపాల్కు చైనా 56 బిలియన్ల నేపాలీ రూపాయల సహాయం అందిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. నేపాల్ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సాయాన్ని వినియోగించాలని కోరారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో జిన్పింగ్ చర్చలు జరిపిన అనంతరం ఈప్రకటన వెలువడింది. తన రెండు రోజుల నేపాల్ అధికారిక పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి చేరుకున్న ఆయన నేపాల్ అధ్యక్షురాలితో ఆమె అధికారిక నివాసం శీతల్ నివాస్లో సమావేశమయ్యారు. 23 ఏండ్ల తర్వాత ఒక చైనా ప్రధాని నేపాల్ సందర్శించడం ఇదే మొదటిసారి.