Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాక్హోం: పేదరిక నిర్మూలనకు కృషి చేసినందుకు గాను అభిజీత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో, క్రెమర్లకు అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. ప్రపంచంలో పేదరికంను ఎలా నిర్మూలించాలో పెద్ద సమస్యలను చిన్నవిగా విభజించి పేదరికంను చాలా వరకు తగ్గించవచ్చనేది పరిశోధనల ద్వారా వీరు రుజువు చేశారు. ఉదాహరణకు విద్యావ్యవస్థలో మార్పులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ ముగ్గురు కొన్ని సూచనలను చేసింది. ఈ సమస్యలను చిన్నవిగా విభజించి ప్రశ్నలు సంధించుకుంటే సమాధానం దొరుకుతుందని అభిజీత్ త్రయం వెల్లడించింది. పిల్లల ఆరోగ్యం, విద్య తదితర మౌళికాంశాలను అభివృద్ధి చేసుకుంటే అనేక కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తాయని అభిజిత్ నేతృత్వంలోని బృందం అభిప్రాయపడింది. కెన్యాలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కొన్ని కుటుంబాల్లో వీటిపై అవగాహన కల్పించారు. దీంతో, ఆ కుటుంబాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో, ఈ నమూనాను మరికొన్ని ప్రపంచదేశాల్లో చేపట్టారు.
1990లో మైఖేల్ క్రెమర్ అతని సహోద్యోగులు పశ్చిమ కెన్యాలో విద్యావ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేశారు. విద్యా విధానంలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఇదే పంథాలో ఇతర దేశాల్లో మిగతా సమస్యలను కూడా అభిజీత్, ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్లు విజయవంతంగా పరిష్కరించారు. వీరు చేసిన ప్రయోగాలు, పరిశోధన విధానాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అమలు చేస్తున్నాయి. తద్వారా అనేక దేశాల్లో పేదరికం తగ్గుముఖం పట్టింది.
బెనర్జీ(58) ముంబయిలో జన్మించారు. కోల్కతా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో ఉన్నత విద్య అభ్యసించారు. ప్రస్తుతం మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఎకనమిక్స్లో 'ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్'గా పనిచేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1988లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందిన ఆయన 2003లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్టన్ లాబ్(జే-పాల్)ను నెలకొల్పారు. ఆర్థికవేత్తలయిన ఎస్తేర్ డఫ్లో, సెంథిల్ మురళీధరన్లతో కలిసి ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక మేగజైన్స్, జర్నల్స్లో వ్యాసాలు రాసిన ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. అభిజిత్ బెనర్జీ 2011లో రాసిన 'పూర్ ఎకనమిక్స్' పుస్తకం గోల్డ్మన్ శాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఇది కాకుండా 'వొలాటిలిటీ అండ్ గ్రోత్', 'అండర్ స్టాండింగ్ పావర్టీ' వంటి పుస్తకాలు రచించారు. '2015 తర్వాత అభివృద్ధి అజెండా'కు సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయీ సంఘంలోనూ పనిచేశారు.
ఈసారి ఇద్దరు మహిళలకు..
అర్థశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ముగిశాయి. ఈ ఏడాది మొత్తం ఆరు రంగాల్లో 15 మందిని నోబెల్ పురస్కారాలు వరించాయి. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. అర్థశాస్త్రంలో ఎస్తర్ డఫ్లోకు నోబెల్ రాగా.. సాహిత్యంలో పోలండ్కు చెందిన ప్రముఖ రచయిత్రి ఓల్గా టోకార్జుక్కు ఈ పురస్కారం ప్రకటించారు. అయితే 2018 సంవత్సరానికి గానూ ఓల్గాకు అవార్డు దక్కింది. లైంగిక వేధింపుల కుంభకోణం నేపథ్యంలో గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని ఇవ్వలేదు. దీంతో ఆ సంవత్సర పురస్కారాన్ని కూడా గతవారం ప్రకటించారు.