Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ సవరణలు చేపట్టొదని డిమాండ్
కొనాక్రి: గినియాలో నిరసనలు వెల్లువెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసే వెసులుబాటు కోసం అధ్యక్షుడు ఆల్ఫా కాండే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణ చేపట్టాలని యోచిస్తున్నారు. కాండే ప్రతిపాదనపై నిరసనలు హౌరెత్తాయి. వేలాది మంది గినియన్లు రాజధాని కొనాక్రీ నగర వీధుల్లోకి చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. రోడ్లపై బైఠాయించి కాండేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు వాహనాల రాకపోకలను స్తంభింపచేశారు. రాజకీయ లబ్ది కోసమే కాండే ప్రయత్నిస్తున్నారని, ఆయన నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని నిరసనకారులు నినదించారు. నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతలతో పాటు హక్కుల సంఘం నేతలు నేతృత్వం వహించారు. గినియాలో నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మృతి చెందినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. లాబె, మామౌ, కిందియా నగరాల్లో నిరసనలు వెల్లువెత్తినట్టు తెలిపాయి. రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని నేషనల్ ఫ్రంట్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద కానిస్టిట్యూషన్ సంస్థ పేర్కొంది. కాగా, నిరసనకారులు తక్షణమే ఆందోళన కార్యక్రమాలను విరమించకుంటే చర్యలు తప్పవని మంత్రి జెన్ బొరేమా కాండే హెచ్చరించారు. నిరసనకారులు బుధవారం తీయాలని యోచిస్తున్న ర్యాలీలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వలేదని అన్నారు.