Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరియాలో హక్కుల ఉల్లంఘన ఘటనలపై చైనా ఆందోళన
- బలగాలను ఉపసంహరించుకోవాలని టర్కీకి హితవు
బీజింగ్ : సిరియా సరిహద్దులో సైనిక చర్యలను ఆపే యాలని చైనా టర్కీని కోరింది. కుర్దు తిరుగుబాటుదారుల ఏరివేత లక్ష్యంగా టర్కీ బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ హింసాత్మకంగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ సైన్యం కాల్పుల్లో అమాయక ప్రజలు మృతిచెందుతున్నారని పేర్కొంది.
ఉత్తర సిరియా సరిహద్దులో కాల్పుల విరమణ పాటించాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరిం చుకోవాలని కోరింది. ఉత్తరసిరియాలో టర్కీ బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, హక్కుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. సిరియన్లు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. టర్కీ చర్యల కారణంగా సిరియన్ల సార్వభౌమత్వం దెబ్బతిన్నదని, సిరియన్లలో అభద్రతా భావం నెలకొందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
టర్కీ బలగాలు తక్షణమే సిరియా సరిహద్దు నుంచి వైదొలగాలని షువాంగ్ కోరారు. కాగా, తమ లక్ష్యం నెరవేరేంత వరకు సిరియాలో ప్రత్యేక ఆపరేషన్ను నిలిపివేసే ప్రసక్తి లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. కుర్దు తిరుగుబాటుదారులను ఏరివేసి సిరియా ఉత్తర భాగంలో సేఫ్జోన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. టర్కీ ఏర్పాటు చేయనున్న రక్షిత ప్రదేశంలో 36 లక్షల మంది సిరియన్లకు ఆశ్రయం కల్పించే అవకాశ ముంటుందని అన్నారు.
ఐఎస్ను కట్టడి చేస్తాం : ఎర్డోగన్
ఐఎస్ను కట్టడి చేస్తామని ఎర్డోగన్ తెలిపారు. టర్కీ బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ కారణంగా కుర్దుల నిర్బంధంలోని కరుడుగట్టిన ఐఎస్ సభ్యులు పారిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా ఉగ్రవాదుల హింసాత్మక చర్యలు పెరిగేపోయే ప్రమాదముందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యల కారణంగా ఐఎస్ బలపడే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎర్డోగన్ తాజా ప్రకటన చేశారు. కుర్దు తిరుగుబాటుదారుల చెరలో ఉన్న ఐఎస్ సభ్యులను తామే నిర్బంధిస్తామని భరోసా ఇచ్చారు. అయిన్ ఇసా క్యాంపు నుంచి 800 మంది ఐఎస్ సభ్యులు పారిపోయారని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థలో ప్రచురితమైన కథనం అవాస్తవమని అన్నారు. ఐఎస్ సభ్యులను నిర్బంధించిన కేంద్రాలపై నిఘా పెట్టామని అన్నారు.ఉత్తరసిరియా సరిహద్దు నుంచి జిహాదీలు తప్పించుకోలేరని అన్నారు.
టర్కీకి ఆయుధాల సరఫరా నిలిపివేత :
టర్కీకి ఆయుధాల సరఫరా నిలిపివేసినట్టు జెక్ రిపబ్లిక్ వెల్లడించింది. సిరియా సరిహద్దులో టర్కీ బలగాలు మోహరింపును వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. టర్కీకి ఆయుధాలను విక్రయించొద్దని ఈయూ చేసిన తీర్మానానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్టు తెలిపింది. సిరియా సరిహద్దులో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని జెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి థామస్ పాట్రిక్ టర్కీని అభ్యర్థించారు.
టర్కీపై కఠిన ఆంక్షలు : ట్రంప్
టర్కీపై కఠిన ఆంక్షలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సిరియాలో కుర్దుల ఆధీనంలో ఉన్న ఈశాన్య ప్రాంతాలపై సైనిక దాడికి పాల్పడుతున్న టర్కీపై ఆంక్షల్లో భాగంగా స్టీల్పై సుంకాలు పెంచునున్నట్టు తెలిపారు. గతంలో టర్కీతో కుదుర్చుకున్న 100బిలియన్ డాలర్ల (పదివేల కోట్ల డాలర్ల) వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అన్నారు. టర్కీ సైనిక చర్య కారణంగా సిరియన్లు అభద్రతా భావానికి గురవుతున్నారని అన్నారు. ప్రాంతీయంగా సుస్థిరత, శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఈ చర్యలు యుద్ధ నేరాలు, మావనత్వ సంక్షోభానికి దారితీస్తున్నాయని టర్కీ అధికారులకు ఇది వరకే స్పష్టం చేశామన్నారు. అయినా 'ఇదే ప్రమాదకరమైన, విధ్వంసక మార్గాన్ని కొనసాగిస్తే టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం' అని ట్రంప్ హెచ్చరించారు. సిరియాలో సైనిక దాడులకు కారణమవుతున్న టర్కీ నేతలపైనా కఠిన నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో వారి ఆస్తుల్ని స్తంభింపజేయడం, అమెరికాలోకి రాకుండా అడ్డుకోవడం లాంటి కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. స్టీల్పై సుంకాలను తిరిగి 50శాతానికి పెంచుతామన్నారు. ఐఎస్ నిర్మూలన కోసం సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో అమెరికా సంకీర్ణ దళాలు మోహరించి ఉన్నాయని అన్నారు.
అమెరికా విధించిన ఆంక్షలు చాలా తీవ్రమైనవని ఆ దేశ ఆర్థిక మంత్రి స్టీవెన్ ముంచిన్ తెలిపారు. అమెరికా విధించిన ఆంక్షలు టర్కీ ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభావం చూపుతాయని అన్నారు. టర్కీ రక్షణ, ఇంధన, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై చర్యలకు ఉపక్రమించామని అమెరికా విత్త మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
టర్కీ తక్షణమే కాల్పుల విరమణ పాటించకుంటే ఆ దేశంపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించారు. ట్రంప్ ఇదే విషయాన్ని ఎర్డోగన్తో ఫోన్లో మాట్లాడుతూ పునరుద్ఘాటించారని పెన్స్ తెలిపారు. టర్కీ సైనిక చర్య ఫలితంగా దాదాపు 1,60,000 మంది పౌరులు నిరాశ్రయులయ్యారని ఐరాస పేర్కొంది.