Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండించిన చైనా
బీజింగ్: హాంకాంగ్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ యాక్ట్ 2019 పేరిట అమెరికా ప్రతినిధుల సభ బుధవారం బిల్లును ఆమోదించటంపై చైనా తీవ్ర నిరసన తెలియచేసింది. అమెరికా విదేశాంగశాఖలోని హాంకాంగ్, మకావ్ వ్యవహారాల విభాగం ప్రతినిధి యాంగ్ గువాంగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రతినిధుల సభ ఈ బిల్లు ఆమోదించటం ద్వారా చైనా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. హాంకాంగ్లో ప్రతిపక్షం, హింసకు పాల్పడుతున్న రాడికల్స్ను సమర్ధించటం వంటి అంశాలు ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. హాంకాంగ్ కార్డును అడ్డం పెట్టుకుని చైనా అభివృద్ధిని అడ్డుకోవాలన్న కొంత మంది అమెరికా రాజకీయ నేతల ప్రయత్నాలు, అమెరికా ప్రతినిధుల సభ ఉద్దేశాలు ఈ బిల్లు ద్వారా తేటతెల్లం అయ్యాయన్నారు. ప్రతిపాదిత ఆర్డినెన్స్కు సంబంధించిన సవరణలతో మొదలైన ఈ కలకలం క్రమంగా హింసాత్మకంగా మారిందని, హాంకాంగ్లోని చైనా వ్యతిరేకులకు అమెరికా తరపు నుంచి అందుతున్న మద్దతుతోనే ఇది జరుగుతోందని యాంగ్ అన్నారు. హాంకాంగ్ తన మాతృదేశానికి తిరిగి బదిలీ అయిన నాటి నుంచి ఒకే దేశం, రెండు వ్యవస్థలు, హాంకాంగ్ ప్రజలే పాలకులు అన్న విధానాలను చైనా అనుసరిస్తోందని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను గుర్తించి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని తాము అమెరికన్ కాంగ్రెస్కు, సంబంధిత రాజకీయ నేతలకు సూచిస్తున్నామని యాంగ్ చెప్పారు. అమెరికా జోక్యం లేకుండా ఉంటే హాంకాంగ్ మరింత వేగంగా శాంతి బాటలో పయనిస్తూ సుస్థిర ప్రగతి సాధిస్తుందని ఆయన ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.