Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘాన్లో 28 మంది మృతి, 55 మందికి గాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో నాన్గర్హార్ ప్రావిన్స్లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా, మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. తాలిబన్లు లేదా ఐఎస్ సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాన్గర్హార్ ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి ముబరేజ్ అటాల్ తెలిపిన వివరాల ప్రకారం...హస్కా మినా నగరంలోని మసీదులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పేలుడు సంభవించడంతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. పేలుడు ధాటికి 28 మంది మృతిచెందారు. 55 మంది గాయపడ్డారు. ఈ ఘటన పేలుడు వల్లే చోటు చేసుకుందా? లేక మోర్టార్లతో దాడి చేశారా? అనే అంశంపై ఆరా తీస్తున్నామని అటాల్ తెలిపారు. ఘటనాస్థలంలో మోర్టార్లు లభించాయని అన్నారు. పేలుడు ఘటనపై నాన్గర్హార్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అత్తావుల్లా ఖోగ్యానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అఫ్ఘాన్లో వరుస పేలుళ్ల ఘటనలు బాగా పెరిగిపోయాయి. తాలిబన్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. దోహా నగరంలో ఏడాది పాటు కొనసాగిన చర్చల్లో పురోగతి కన్పించిన విషయాన్ని గమనించిన అమెరికా తన కపట బుద్ధి ప్రదర్శించింది. ఈ చర్చలకు తాము మద్దతివ్వడంలేదని స్పష్టం చేసింది. దీంతో, ఓ కొలిక్కి వచ్చిన చర్చలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఓపక్క చర్చలకు హాజరవుతూనే మరోపక్క తాలిబన్లు అఫ్ఘాన్లో మారణహౌమం సృష్టించారని అమెరికా ఆరోపించింది.
అందుకే, చర్చల నుంచి తప్పుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాలిబన్లకు, అఫ్ఘాన్ ప్రతినిధులకు మధ్య కొనసాగిన చర్చల నుంచి అమెరికా తప్పుకోవడంతో తాలిబన్ ప్రతినిధులు రష్యాను ఆశ్రయించారు. తమ డిమాండ్లకు అఫ్ఘాన్ సర్కార్ అంగీకరించినట్టయితే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. అఫ్ఘాన్లో శాంతి స్థాపనలో తామంతా భాగస్వామ్యమవుతామని అన్నారు. ఇదిలా ఉండగా, అఫ్ఘాన్లో ఈఏడాది జులై 1 నుంచి సెప్టెంబర్30 వరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 1,174 మంది మృతి చెందగా...3,139 మంది గాయపడ్డారని ఐరాస తెలిపింది. అఫ్ఘాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా సామాన్య పౌరులు మృతి చెందడం పట్ల ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.