Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
జెనీవా: సమస్త మానవాళిని వణికించిన ఎబోలా వైరస్ ఆఫ్రికాలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో వేగంగా విజృంభిస్తున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎబోలా వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) రెండో అత్యంత ప్రమాదకారి వైరస్గా గుర్తిస్తూ .. ఈ వ్యాధిపై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ వ్యాధిపై మూడునెలల పాటు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంపొందిచుకోవాలని తెలిపారు. గతంలో డబ్ల్యూహెచ్ఓ నాలుగు సార్లు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మొదటి సారిగా 2009లో స్వైన్ఫ్లూ పై, 2014లో పోలియోపై, 2014లో ఎబోలాపై, 2016లో జీగా వైరస్పై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటి వరకూ ఎబోలా వైరస్ సోకి ఆఫ్రికాలో 11 వేల మందికి పైగా మరణించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ.. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉందనీ, వ్యాధి పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇటీవల మెర్క్షార్ప్, డోహ్మేలు ఎబోలా వైరస్ను నివారించడానికి వ్యాక్సిన్ను కనిపెట్టారనీ, త్వరలోనే ఈ వ్యాక్సిన్కు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నుంచి అమోదం లభిస్తుందని తెలిపారు. అలాగే బెల్జియం అనుబంధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఎబోలా నివారణకు వ్యాక్సిన్ తయారు చేస్తుందని డీఆర్ కాంగో వైద్య అధికారులు తెలిపారు.