Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడులపై విశ్వాసం దెబ్బతింటోంది
- దారిద్య్రాన్ని ఎదుర్కోవడం కష్టమవుతోంది : ప్రపంచ దేశాలకు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధాలకు ముగింపు పలకాలని 189 సభ్య దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ విజ్ఞప్తి చేశాయి. విభేదాల వల్ల ప్రపంచ మందగమనం కారణంగా జరిగే నష్టాలు మరింత తీవ్రమవుతు న్నాయని వారు గుర్తు చేశారు. వాణిజ్య ఉద్రిక్తతల వల్ల పెట్టుబడులు, వ్యాపారంపై విశ్వాసం దెబ్బతింటుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జిఎవా అన్నారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, యూరప్ దేశాల బ్రెగ్జిట్ సమస్యను ఆమె ప్రస్తావించారు.
ప్రపంచ ఆర్థికవృద్ధి మందగమనం వల్ల తీవ్ర దారిద్య్ర పరిస్థితుల్లో ఉన్న 70 కోట్లమందికి సహాయమందించడం ఇబ్బందికరంగా మారిందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ అన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ(మధ్య ప్రాచ్యంలో) వైషమ్యాల వల్ల శరణార్థులుగా మారుతున్నవారికి ఆశ్రయం కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన గుర్తు చేశారు. పలు దేశాలు ఉద్రిక్తత, వైషమ్యాలు, హింసాత్మక పరిస్థితుల్లో ఉన్నందున అభివృద్ధి క్లిష్టంగా మారిందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 90 శాతం మందగమనంలో ఉన్నదని, వృద్ధిరేట్ బలహీనంగా నమోదు కానున్నదని జార్జిఎవా తెలిపారు.
ఇప్పటికే ఈ ఏడాది ప్రపంచ వృద్ధిరేట్ అంచనాను 3 శాతానికే ఐఎంఎఫ్ పరిమితం చేసింది. ఈ దశాబ్దంలోనే ఇది అత్యల్పం. వాణిజ్య ఒప్పందంపై గతవారం అమెరికా, చైనాల నుంచి వచ్చిన ప్రకటన వల్ల ఒకింత ఊరట లభించిందని జార్జిఎవా అన్నారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య విభేదాలు సమసిపోయేవరకూ ప్రపంచ వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోదని ఆమె తెలిపారు. వాణిజ్య సంధి ద్వారా వాణిజ్య శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.
గత ఆదేశాలకనుగుణంగా 25,000కోట్ల డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఈ వారం నుంచి అమలులోకి రానున్న సుంకాల పెంపును రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఈ ఏడాది నవంబర్ మధ్యలో ఆసియా పసిఫిక్ కోఆపరేషన్ సదస్సు సందర్భంగా ట్రంప్ భేటీ కానున్నారు. ఆ రెండు దేశాల మధ్య మొదటిదశ ఒప్పందం ఆ సందర్భంగా జరగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.