Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీలోని ఇజ్మియా నగరంలో ఈనెల18న ప్రారంభమైన వర్కర్స్, కమ్యూనిస్టు పార్టీల 21వ అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 74 కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల తరఫున 134 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీల తరపున సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఎంఎ బేబి ఈ మహాసభలకు హాజరయ్యారు. 'అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది, శాంతి, సోషలిజం కోసం కొనసాగుతున్న పోరు' అనే ఇతివృత్తంతో జరిగిన ఈ మహాసభలకు టర్కీ కమ్యూనిస్టు పార్టీ, గ్రీక్ కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. 20వ శతాబ్ది తొలి నాళ్లలో కమ్యూనిస్టు శక్తులు, శ్రామిక వర్గాలు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి కల్పించిన విలువను, ప్రాధాన్యతను ఈ మహాసభలకు హాజరైన కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు విశ్లేషించారు. ప్రస్తుతం కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల పోరాటాలకు మార్క్సిజం, లెనినిజంవేసిన పునాదులను వివరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అరతర్గత ఘర్షణలు క్రమంగా ఉధృత రూపం దాల్చి సమీప భవిష్యత్తులో తీవ్ర సంక్షోభానికి దారి తీసే ప్రమాదముందని, పెట్టుబడిదారీ విధానం ఈ ఘర్షణలకు పరిష్కారం కనుగొనటంలో విఫలమవుతోందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు మరింత బలోపేతమై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటం ద్వారా శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాలు, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకునేందుకు వీలుంటుందని వారు సూచించారు. గతంలో కొనసాగిన పోరాట కార్యకలాపాల ఫలితాలను, ప్రస్తుత పరిస్థితిని విపులంగా చర్చించిన కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీలకు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా కమ్యూనిస్టు శక్తులు, శ్రామిక వర్గాలు ఐక్యగళాన్ని వినిపించాలని ఈ మహాసభలు ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక తీర్మానంలో పిలుపునిచ్చాయి. మహాసభల ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీలు టర్కీ, గ్రీస్ కమ్యూనిస్టు పార్టీల నేతలు, శ్రేణులతోపాటు ఇతర పార్టీల నేతలతో కలిసి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటంపై చర్చించారు. ప్రాంతీయ విభేదాలను అంతర్జాతీయ చట్టాలు, ఐరాస తీర్మానాల ప్రాతిపదికగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పార్టీలు అభిప్రాయపడ్డాయి.