Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత గోల్ఫ్ రిసార్టులో జీ-7 సభ్యదేశాధినేతల సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్షాలు, మీడియాలో తీవ్ర విమర్శలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్లో ప్రకటించారు. వేరే వేదికలతో పోలిస్తే తన కుటుంబానికి చెందిన రిసార్టులో తక్కువ ఖర్చు అవుతుందని, ఆ విధంగా ప్రభుత్వానికి మేలు చేద్దామని భావించానని అన్నారు. నిబంధనలను అనుమితిస్తే ఎలాంటి రుసుము తీసుకోకుండానే సదస్సు నిర్వహిద్దామని భావించానని అన్నారు. కానీ, మీడియా, డెమోక్రటిక్ పార్టీ నేతల అసంబద్ధమైన విమర్శలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటు న్నానని తెలిపారు. మరో వేదిక కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభిం చారని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న జీ-7 సభ్యదేశాధినేతల సదస్సును ట్రంప్నకు చెందిన సొంత గోల్ఫ్ రిసార్టులో నిర్వహించాలని వైట్హౌస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి 12 వరకు జరగనున్న 46వ జీ-7 సదస్సును ఫ్లోరిడాలోని ట్రంప్ నేషనల్ డోరల్ రిసార్టులో నిర్వహించాలని ఖరారు చేశారు. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఇంతగా దుర్వినియోగం చేసిన వారు ఎవరూ లేరంటూ దీనిపై విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా, వచ్చేఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఆయన తన సొంత రిసార్టులో జీ-7 సభ్యదేశాల సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. 2015 నుంచి ఈ రిసార్టు ఆదాయం పడిపోతుండడంతో దీన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైట్హౌస్ వివరణ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలను పరిశీలించగా, వీటన్నింటికన్నా సగం ఖర్చులో ట్రంప్ రిసార్టు మాత్రమే లభించిందని తెలిపింది. అయినా విమర్శలు ఆగకపోవడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా ట్రంప్ ప్రకటించారు.