Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో రోజుకు చేరుకున్న నిరసనలు
బీరుట్ : లెబనాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. ఆందోళనకారులు ఆదివారం పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుకొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. లెబనాన్ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. వస్తు సేవల ధరలను నియంత్రించాలని కోరారు. ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై పట్టించుకోకుంటే ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు. అధికార క్రిస్టియన్ పార్టీ నేతలంతా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ప్రధాని సాద్ హరీరీ విఫలయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి కారణంగా కార్మిక శాఖ మంత్రి పదవి నుంచి వైదొలగినట్టు కామిల్లె అబాస్లిమన్ తెలిపారు. నిరసనకారులకే తాను సంపూర్ణ మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలుచోట్ల బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఏడాది జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఇదే అతిపెద్దదని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, పౌరులపై అధిక పన్ను భారం మోపాలని లెబనాన్ సర్కారు యోచిస్తున్నది. దేశ ప్రజలు వినియోగిస్తున్న సామాజిక మాధ్య మాలను కూడా ఉపేక్షించొద్దని నిర్ణయించుకుంది. లెబనాన్లో వాట్సాప్ వినియోగం అధికంగా ఉంటుంది. నెటిజన్లు వాట్సాప్లో ఇంటర్నెట్ ప్రొటో కాల్ విధానంలో వాయిస్ కాల్ చేసినట్టయితే 20 సెంట్స్ వసూలు చేయాలని ఆపరేటర్స్ను ఆదేశిం చింది. లెబనాన్లో నిరుద్యోగ సమస్య కూడా అధికం గా ఉన్నది. తాజా గణాంకాల ప్రకారం 35ఏండ్ల లోబడి ఉన్నవారిలో 37శాతం నిరుద్యోగం ఉన్నది.