Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరియాపై దురాక్రమణకు పాల్పడాలనే ఉద్దేశం లేదు : ఎర్డోగన్
అంకారా : ఉత్తర సిరియాలో పాగావేసిన కుర్దు తిరుగు బాటుదారులను అణచివేస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు. టర్కీ బలగాలు కుర్దు తిరుగుబాటుదారుల ఏరివేత పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపడుతూ సిరియాపై దురాక్రమణకు పాల్పడేందుకు పావులు కదుపుతున్నాయని అగ్రరాజ్యం ఆరోపించిన సంగతి తెలిసిందే. అమెరికా ఆరోపణలను ఎర్డోగన్ తాజాగా ఖండించారు. ఉగ్రవాద నిర్మూలనలో మిత్రదేశాలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కుర్దు తిరుగుబాటుదారులు 1984 నుంచి టర్కీలో అంతర్గత కల్లోలాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కుర్దు తిరుగుబాటుదారులు ఉనికి కోసం పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీని స్థాపించి అరాచకాలను సృష్టించారని ఎర్డోగన్ విమర్శించారు. అందుకే, కుర్దు తిరుగుబాటుదారులను తాము మిలిటెంట్లుగా పరిగణిస్తామని అన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా కుర్దు తిరుగుబాటుదారులను బ్లాక్ లిస్ట్లో చేర్చిన విషయాన్ని ఎర్డోగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.