Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : ఉత్తరసిరియాలో ఐదురోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ మంగళవారం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో కుర్దు తిరుగుబాటుదారులకు చెందిన 125 వాహనాలు ఉత్తరసిరియా సరిహద్దు నుంచి బయటకు వెళ్లిపోయాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు. కుర్దు తిరుగుబాటుదారులు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారని అన్నారు. ఈ ఒప్పందానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. అయితే, కాల్పుల విరమణ ముగిసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో రస్ అలైన్, తల్ అబ్యాద్ నగరాల మధ్య సేఫ్ జోన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్తరసిరియా సరిహద్దులో 444 కిలోమీటర్ల విస్తీర్ణంలో సేఫ్ జోన్ల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. కాల్పుల విరమణ ముగిసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ అంశంపై చర్చిస్తామని అన్నారు. ఉత్తరసిరియాలో పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అంశం చేపట్టాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, ఉత్తరసిరియా సరిహద్దు నుంచి అమెరికా బలగాలు వైదొలగడంతో టర్కీ బలగాలు రంగ ప్రవేశం చేశాయి. కుర్దు తిరుగుబాటుదారులను ఉత్తరసిరియా సరిహద్దు నుంచి పారద్రోలి సేఫ్జోన్ ఏర్పాటు చేయనున్నట్టు ఎర్డోగన్ ప్రకటించారు. సిరియా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన 36 లక్షల మంది సిరియన్లకు ఈ ప్రాంతంలో ఆశ్రయం కల్పిస్తామని అన్నారు. ఎర్డోగన్ చర్యలను అనేక దేశాలు తప్పుపట్టాయి. అంకారా బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ కారణంగా వందలాది మంది అమాయక పౌరులు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను వెన్నుపోటు పొడిచాడని కుర్దు తిరుగుబాటుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎస్కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో అమెరికా బలగాలు తమతో కలిసి పనిచేశాయని కుర్దు తిరుగుబాటుదారులు పేర్కొన్నారు
సిరియా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు :పుతిన్
సిరియా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ఏ దేశమైనా ప్రయత్నించినట్టయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. అంకారా బలగాలు సిరియాలో చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. మాంబిజ్, కొబానీ నగరాల్లో సిరియా, రష్యా బలగాలు మోహరించాయని అన్నారు. కుర్దు తిరుగుబాటుదారుల లక్ష్యంగా టర్కీ సైన్యం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ కారణంగా అమాయక ప్రజలు మృతిచెందుతుండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. అందుకే, ఉత్తరసిరియాలో మరికొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఎర్డోగన్తో జరిగిన భేటీలో సూచించానని అన్నారు. కాగా, గతేడాది టర్కీ, రష్యా మధ్య క్షిపణి దాడులను ఎదుర్కొనే వ్యవస్థ కొనుగోలు అంశంపై చర్చ జరిగింది. రష్యాకు చెందిన ఎస్-400 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు టర్కీ ముందుకొచ్చింది. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినట్టయితే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించినా టర్కీ పట్టించుకోలేదు.
సిరియాపై దొంగదెబ్బకు ఎర్డోగన్ ప్రయత్నాలు
కుర్దు తిరుగుబాటుదారుల లక్ష్యంగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించడం కోసం ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నారని సిరియా అధ్యక్షుడు అస్సద్ ఆరోపించారు. సిరియాపై దొంగదెబ్బ తీసేందుకు ఎర్డోగన్ కుట్ర పన్నారని విమర్శిం చారు. సిరియా సార్వ భౌమత్వాన్ని దెబ్బ తీయాలనే దురుద్దేశంతో ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నారని అన్నారు. సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోందన్నారు. కుర్దు తిరుగుబాటు దారులు, ఐఎస్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు త్వరలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నామని అస్సద్ స్పష్టం చేశారు. ఇద్లిబ్ ప్రావిన్స్లో తొలిసారి పర్యటించిన అస్సద్ పై వ్యాఖ్యలు చేశారు. సిరియాలోని భూభాగాన్ని ఆక్రమించు కోవాలని ఎర్డోగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.