Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, భారత్లను బూచిగా చూపుతున్న ట్రంప్
వాషింగ్టన్: పారిస్లో కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని తాము నిర్ణయం తీసుకోవడానికి భారత్, చైనా దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ ఒప్పందం సహేతుకం కాదని, దాని ద్వారా ప్రయోజనం పొందుతున్న చైనా, భారత్ వంటి దేశాలకు తాము భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం నుంచి తమ దేశం తప్పుకుంటోందని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ లోని ఎకనామిక్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
పారిస్ ఒప్పందం కారణంగా అమెరికా కోట్లాది డాలర్లను నష్టపోవాల్సి వస్తోందని, అలాగే ఎన్నో ఉద్యోగావకాశాలను కోల్పోతోందని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి పరిశ్రమలపై అది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. చైనా, భారత్ వంటి దేశాలకు మేం సొమ్ము చెల్లించాల్సి వస్తోంది.. సాంకేతిక పరిజ్ఞాన పరంగానే కాకుండా వాతావరణ మార్పుపై ఈ దేశాలు చేసే పనులకు మేం డబ్బు చెల్లించవలసి రావడం విడ్డూరం అని' అన్నారు. అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ఆర్థికంగా అసమంజసమైనదని, అమెరికన్ ఉద్యోగాల్లో కోత పడుతోందని, పైగా అది విదేశీ కాలుష్య కారకుల 'కొమ్ము కాస్తోందని ట్రంప్ విరుచుకు పడ్డారు. వర్ధమాన దేశమని భారత్ చెప్పుకుంటోంది.. అసలు మనదీ వర్ధమాన దేశమే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం నుంచి వైదొలగాలన్న అమెరికా నిర్ణయం ఆ దేశానికే గాక ప్రపంచం మొత్తానికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ట్రంప్ యంత్రాంగం ఇటీవల ఐక్యరాజ్యసమితికి అధికారికంగా ఈ నిర్ణయాన్ని తెలియ జేసింది. దీంతో ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇది పూర్తయ్యేందుకు ఏడాది కాలం పడుతుంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో డిసెంబరు 2 నుంచి 13వరకు పర్యావరణ మార్పుపై ఐరాస 25వ సదస్సు జరగనుంది. అయితే, దీనికి నెల ముందుగా అమెరికా తన నిర్ణయం ప్రకటించింది. వాస్తవానికి ఈ సదస్సును చిలీ రాజ ధాని శాంటియాగోలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ దేశంలో ప్రజల ఆందోళనల కారణంగా వేదిక మాడ్రిడ్కు మారింది.
పారిస్ ఒప్పందంపై 2015లో 196 దేశాలు సంతకం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత ప్రమాద స్థాయికి వెళ్లకుండా హరితవాయు ఉద్గారాలను తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఆ మేరకు అంత ర్జాతీయంగా ఉష్ణోగ్రత సగటు పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కన్నా తక్కువగా ఉంచాలన్నది దీని ధ్యేయం. అయితే, ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న ఈ లక్ష్యానికి అమెరికా నిర్ణయం తీవ్ర విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఒప్పందం నుంచి వైదొలగనున్న దేశం అమెరికా ఒక్కటే.. ఒప్పందంపై సంతకం చేసినప్పుడు జాతీయ హరితవాయు ఉద్గారాలను 26 నుంచి 28 శాతం మేర తగ్గిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. కానీ, అమెరికా నిష్క్రమణతో 97 శాతంగా ఉండాల్సిన అంతర్జాతీయ హరితవాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యం. ప్రస్తుతం 80 శాతానికి పరిమితం కానుంది.
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పారిస్ వాతావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే తన హామీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఐరాస నిబంధనల ప్రకారం 2019 నవంబర్ 4 వరకు ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించడం ట్రంప్ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పారిస్ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూతాపం నియంత్రణకు అనుగుణంగా 2015లో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగు తున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం నుంచి వైదొలగడానికి చైనా, భారత్ దేశాలు కారణమని బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలుషిత వాయువులను గాలిలోకి వదిలే దేశమే అమెరికా.