Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు విదేశీయులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్లో తాలిబన్ల కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ దాడి కూడా తాలిబన్ల పనేనని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మసూద్ అందరాబీ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్ విమానాశ్రయానికి సమీపంలోని కెనడా సెక్యూరిటీ కంపెనీని లక్ష్యంగా చేసుకొని బుధవారం కొందరు మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఆర్మీ చెరలో ఉన్న ముగ్గురు కరుడుగట్టిన మిలిటెంట్లను విడుదల చేయనున్నట్టు అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మంగళవారం ప్రకటించారు. ఆయన ప్రకటించిన మరుసటి రోజే ఉగ్రవాదులు మరోదాడికి పాల్పడ్డారు. మిలిటెంట్ల ఆరోగ్యం క్షిణించడాన్ని పరిగణనలోకి తీసుకొని విడుదల చేయనున్నట్టు ఘనీ ప్రకటించారు. కాగా, అఫ్ఘాన్లో శాంతి స్థాపన కోసం ఘనీ సర్కార్ గతేడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది.గతంలో తాలిబన్ ప్రతినిధులకు, అఫ్ఘాన్ అధికారులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్ నేతల డిమాండ్లపై అఫ్ఘాన్ సర్కారు స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఖతార్లోనూ తాలిబన్ ప్రతినిధులు, అఫ్ఘాన్ అధికారుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈచర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే మరోపక్క అమెరికా సైన్యంపై తాలిబన్లు దాడులకు పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో చర్చల నుంచి వైదొలిగినట్టు అమెరికా ప్రకటించుకుంది. దీంతో, అఫ్ఘాన్లో హింసాత్మక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.