Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం ఓటర్లతో వెళ్తున్న వాహనాలపై దుండగుల దుశ్చర్య
- తమిళులు, ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గొటబాయ రాజపక్స వర్గం
కొలంబో : శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మత ఉద్రిక్తతలు, రాజకీయ విభజనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పోలింగ్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తు తున్నాయి. శ్రీలంకలో 269 మందిని పొట్టనబెట్టుకున్న ఈస్టర్ సండే బాంబు పేలుళ్ల తర్వాత మత ఉద్రిక్తతలు తీవ్రమవుతూ వచ్చాయి. అప్పటి నుంచి దేశంలో తొమ్మిది శాతమున్న ముస్లింవర్గాన్ని నేషనలిస్ట్ బౌద్ధమతస్థులు లక్ష్యం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాయవ్య శ్రీలకంలోని మన్నార్ ప్రాంతంలో ఓట్లేయడానికి వెళ్తున్న ముస్లింలపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రాళ్లు రువ్వారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేవని, నిందితుల అరెస్టులూ జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాదాపు 100 వాహనాలతో కూడిన కాన్వారుపై దాడి చేయడానికి దుండగులు రోడ్లకు అడ్డంగా టైర్లను కాల్చినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. రహదార్లకు అడ్డుగా ఉన్న టైర్లను తొలగించారు. ఈస్టర్ పేలుళ్ల తర్వాత ముస్లింలపై ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడుల దృష్య్టానే అంతర్గతంగా వలసలు వెళ్లాల్సివచ్చిన ముస్లింలు తాముంటున్న నివాసాలకు సమీపంలోనే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని కోరారు. కానీ, వాటి ఏర్పాటు జరగలేదు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ముందే ఊహించిన ఆ వర్గం తాజాగా ఈ దుశ్చర్యను ఎదుర్కొంది.
తమిళులు, ముస్లింలే లక్ష్యం?
2015లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేన మరోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీ(యుఎన్పీ) నుంచి సాజిత్ ప్రేమదాస, సింహళీస్ బుద్ధిస్ట్ పార్టీ(ఎస్ఎల్పీపీ) నుంచి మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సోదరుడు గొటబాయ రాజపక్సే, నేషనల్ పీపుల్స్ పవర్ సంకీర్ణ కూటమి అభ్యర్థి అనురా కుమార దిస్సన్నాయకే పోటీ చేస్తున్నారు. మహింద రాజపక్సే హయాంలో శ్రీలంక అంతర్గత యుద్ధం (లక్షల మంది తమిళులను తుడిచిపెట్టిన) సమయంలో డిఫెన్స్ మంత్రిగా గొటబాయ రాజపక్సేనే ఉన్నారు. దీంతో తమిళుల ఓట్లు యుఎన్పీవైపే పడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
కాగా, మిలిటరీతో ఇప్పటికీ గట్టి సంబంధాలున్న గొటబాయ రాజపక్సే.. ముస్లింలపై అరాచకాలకు పాల్పడుతున్న, వారి భావోద్వేగాలకు భంగం కల్పిస్తున్న నేషనలిస్ట్ బౌద్ధమతస్థుల గ్రూపులకు సానుభూతిగా ఉంటూ వస్తున్నారు. దీంతో ముస్లిం ఓట్లూ యుఎన్పీ వైపే పడే అవకాశముండటంతో.. ఈ నేషనలిస్ట్ బౌద్ధమత గ్రూపులు వారిపై దాడులుకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తు న్నట్టు సమాచారం. తమిళులు అధికంగా ఉండే జాఫ్నా లాంటి జిల్లాలోనైతే మిలిటరీ బలగాలు అనూహ్యంగా మోహరించాయి. తమిళులు, ముస్లింలు పోలింగ్లో పాల్గొనకుండా.. కొన్ని మిలిటరీ బలగాలు రోడ్లను మూసివేసి అడ్డుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. తమిళులు, ముస్లింల ఓటింగ్ను అడ్డుకుంటే తక్కువ పోలింగ్ నమోదైనా.. గొటబాయ రాజపక్సే విజయానికే ఎక్కువ అవకాశాలుంటాయని విశ్లేషణలు వచ్చాయి. కాగా, మిలిటరీ బలగాలు.. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలని, పౌరులను అడ్డుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్థానిక మిలిటరీ కమాండర్లను హెచ్చరించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి.