Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ ప్రధాని షింజో అబే
రియాద్ : ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించనున్నట్టు జపాన్ ప్రధాని షింజో అబే ఉద్ఘాటించారు. చమురు దిగుమతులపై తాము ఇరాన్పైనే ఆధారపడి ఉన్నామని అన్నారు. అమెరికా మిత్రదేశమైన జపాన్ నుంచి ఇలాంటి స్పందన వెలువడం గల్ఫ్ దేశాల్లో చర్చనీయాంశమైంది. ఐదురోజుల పర్యటన కోసం షింజో అబే గల్ఫ్ పర్యటనకు వచ్చారు. సోమవారం సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జపాన్, సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమానిని క్షిపణుల దాడులతో అమెరికా హతమార్చిన అనంతరం మధ్యప్రాఛ్యంలో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాధినేతలు చర్చించారు. అమెరికా,ఇరాన్ దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణగకున్నట్టయితే ఏర్పడే దుష్పరిణామాలపై చర్చించారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించినట్టయితే దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై ఉంటుందని షింజో అబే అభిప్రాయపడ్డారు. ఇరాన్పై యుద్ధానికి జపాన్ సహకరిస్తోందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము ఇరాన్తో యుద్ధం కోరుకోవడంలేదని అన్నారు. చమురు దిగుమతులపై తాము ఇరాన్పైనే ఆధారపడి ఉన్నామని అన్నారు. ఇరాన్పై యుద్ధం అనివార్యమైనట్టయితే తమ బలగాలను ఇరాన్కు ఎట్టిపరిస్థితుల్లో పంపించలేమని ఉద్ఘాటించారు. ఇరాన్-అమెరికా మధ్య శాంతి స్థాపన జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఒమన్, యూఏఈ పర్యటనల్లోనూ ఇదే విషయంపై చర్చిస్తామని అన్నారు. ఇరాన్పై ఆంక్షల తొలగింపు అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాలోచించాలని ఆయన కోరారు.