Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్కు చేరుకున్నారు. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గురువారం భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమవుతారని పేర్కొంది. ఇరాన్,అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చిస్తారని తెలిపింది. శుక్రవారం ముంబయి నగరంలోని పలువురు వ్యాపారవేత్తలతో సమావేశం ముగిసిన అనంతరం ఇరాన్కు వెళ్లిపోతారని తెలిపింది. కాగా, ఈనెల3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని కాన్వారుని లక్ష్యంగా చేసుకొని అమెరికా క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సులేమాని మృతిచెందారు. ఈ ఘటన అనంతరం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు మధ్యప్రాఛ్య దేశాలు కూడా అమెరికా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంతో బాగ్దాద్లోని యూఎస్ వైమానిక స్థావరాలపై ఇరాన్ రాకెట్ లాంఛర్లు ప్రయోగించి 186 మంది ఆ దేశ సైనికులను హతమార్చింది. ఇరాన్లోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడులకు పాల్పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రౌహానీ సర్కారును హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ అమెరికా మిత్రదేశమైన జపాన్ ప్రధాని షింజో అబే మధ్యప్రాఛ్యంలో పర్యటించారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు అతి త్వరలో సద్దుమణిగే అవకాశముందని సంకేతాలిచ్చారు. ఇరాన్పై మోపిన ఆంక్షల తొలగింపు అంశంపై అమెరికా పునరాలోచించాలని అభ్యర్థించారు. యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లోనూ పర్యటించనున్నట్టు తెలిపారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం సంభవించినట్టయితే దీని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.