Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ గురువారం సెనేట్కు చేరింది. అభిశంసన విచారణను సెనేట్కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జరిగిన ఓటింగ్లో 228 మంది సభ్యులకుగానూ 193 మంది ట్రంప్నకు వ్యతిరేకంగా ఓటేశారు. వచ్చే వారం సెనేట్లో జరిగే అభిశంసన విచారణ కోసం హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రత్యేక న్యాయ మండలిని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్కు చెందిన ఏడుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ ప్రత్యేక కమిటీకి నాయకత్వ బాధ్యతను యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ షిఫ్కు అప్పగించారు. అనంతరం అభిశంసన విచారణను సెనేట్కు పంపే రెండు తీర్మానాలపై పెలోసీ సంతకం చేశారు. కాగా, అభిశంసన విచారణపై ఎలాంటి భయం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. విచారణను సమర్థంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. సెనేట్లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండడంతో అభింశంసన నుంచి గట్టెక్కుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.తనను అప్రతిష్టపాలు చేసేందుకే డెమోక్రట్లు అభిశంసన తీర్మానాన్ని తెరపైకీ తీసుకొచ్చారని విమర్శించారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడిన్ను ఎన్నికల్లో పోటీచేయకుండా తాను ఇరకాటంలో పడేసానని వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. ఉక్రెయిన్లో ఆయన కుమారుడి వాణిజ్య సంస్థలపై దాడులు నిర్వహించాలని తాను చెప్పలేదని అన్నారు. అభిశంసన తీర్మానం నుంచి తాను గట్టెక్కుతానని, రానున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.