Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి
వాషింగ్టన్ :దక్షిణాసియాలో భద్రత,స్ధిరత్వాలకు తమ దేశం కట్టుబడి ఉన్నదని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖరేషి అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో శుక్రవారం భేటీ అయ్యారు. నేతలిరువురూ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు ఆఫ్ఘనిస్ధాన్, మధ్య ప్రాచ్యంలోని పరిస్థితిపైనా చర్చించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్తో కూడా ఖురేషి భేటీ అయ్యారు. అంతకుముందు గురువారం అమెరికా చట్టసభ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఖురేషి ఒక ట్వీట్ చేస్తూ ''పాంపియోతో జరిగిన సమావేశంలో పాక్, అమెరికాల మధ్య సంబంధాలపై చర్చించాం. దక్షిణాసియాలో స్ధిరత్వంతో పాటు, పరస్పర ప్రయోజనాలపై చర్చించాం. రెండు దేశాల మధ్య భాగస్వామ్యంలో వాణిజ్య, పెట్టుబడుల ప్రాధాన్యతపైనా చర్చించాం.'' అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఖురేషీ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ''ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని పరిష్కరించే వరకు దక్షిణ ఆసియాలో 'శాంతి' అస్పష్టంగా ఉంటుంది'' అని ఖురేషి పేర్కొన్నారు.
అంతకుముందు ఖురేషి గురువారం అమెరికా లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ( సీఎస్ఐఎస్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలన్న పాక్ డిమాండ్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.