Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నమోదయిన అభిశంసన అభియోగాలపై అమెరికన్ కాంగ్రెస్ ఎగువసభ సెనేట్ మంగళవారం విచారణ ప్రారంభించింది. అభిశంసనకు అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించిన తీర్మానంపై సెనేట్ చర్చ అనంతరం ఓటింగ్ జరుగనుంది. సెనేట్ సమావేశానికి అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ సమక్షంలో సెనేట్ మెజార్టీ పక్షనేత మిఛ్ మెక్ కానెల్ ప్రతిపాదించిన తీర్మానం ముసాయిదాను సెనేట్ క్లర్క్ లాంఛనంగా చదివి వినిపించారు. అనంతరం విచారణ నియమ, నిబంధనలపై సభలోని ఇరుపక్షాలతో పాటు ప్రాసిక్యూటర్లు, ట్రంప్ న్యాయసలహా బృందం విస్తృతంగా చర్చించాయి. ట్రంప్ తరపు న్యాయసలహా బృందం సభ్యుడైన వైట్ హౌస్ న్యాయసలహాదారు పాట్ సిపోలోన్ మాట్లాడుతూ మెక్ కానెల్ ప్రతిపాదించిన తీర్మానం ముసాయిదాను సమర్ధించారు. తాము ఈ తీర్మానాన్ని సమర్ధిస్తున్నామని, ఈ విచారణకు ఇది అత్యంత అనువైన మార్గమని అన్నారు. అయితే చివరి నిముషంలో ఈ తీర్మానంలో మార్పులను ప్రతిపాదించిన మెక్ కానెల్ ట్రంప్ అభిశంసన విచారణపై అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనను వినే గడువును రెండు రోజుల నుంచి మూడు రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ తీర్మానాన్ని డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సిపోలోన్ మాట్లాడుతూ 'తొలి వాదనలు విన్న తర్వాత అధ్యక్షుడు ఎటువంటి తప్పూ చేయలేదన్న నిర్ధారణకు వస్తారు. అభిశంసన అభియోగాలు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం నమోదు కాలేదు' అని అన్నారు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ విధులను అడ్డుకోవటం వంటి అభియోగాలతో ట్రంప్ను అభిశంసిస్తూ ప్రతినిధుల సభ గత నెలలో తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన విచారణ కమిటీకి నేతృత్వం వహించిన ఇంటెలిజెన్స్ వ్యవహారాల సభా సంఘం ఛైర్మన్ ఆడమ్ స్కిఫ్ మెక్కానెల్ ప్రతిపాదనను ఖండించారు. ముందుగా విచారణ నిర్వాహకులు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతించాలని, తర్వాత అధ్యక్షుడి వాదనను కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. అధ్యక్షునికి తనపై నమోదైన అభియోగాలను ఖండించేందుకు అవకాశం కల్పించాలన్నారు. మరో విచారణకు ఇది భిన్నంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు. అది అవసరం లేదు. మెక్కానెల్ ప్రతిపాదిస్తున్న తీర్మానం విచారణ దశ, దిశను మారుస్తుందని, అధ్యక్షుడు తాను జవాబుదారీ తనానికి, చట్టానికి అతీతంగా వ్యవహరించాలని భావిస్తున్నారని స్కిఫ్ వ్యాఖ్యానించారు.
మెక్ కానెల్ ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం ప్రతినిధుల సభ నుండి అందిన అభియోగాలపై అదనపు సాక్ష్యాలను నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, సెనేట్ విచారణ సమయంలో హౌస్ ప్రాసిక్యూటర్లు ఆధారాలను నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు బదులుగా అసలు అభిశంసన అభియోగాలను సాధారణ మెజార్టీతో తిరస్కరించాలని ఈ తీర్మానం ప్రతిపాదిస్తోంది.