Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాక్లో మిలియన్ మార్చ్
- అల్సద్ర్ నేతృత్వంలో నిరసనలు
బాగ్దాద్ : ఇరాక్లో అమెరికా వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాక్ భూభాగంలోని అమెరికా బలగాలు తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బాగ్దాద్ వీధుల్లోకి వేలాదిగా తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నిందని నిరసనకారులు గళమెత్తారు. ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్పై క్షిపణుల దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన కార్యక్రమాలకు షియా నేత ముఖ్తదా అల్సద్ర్ నేతృత్వం వహించారు. బాగ్దాద్ నగరం నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వ అసమర్ధ విధానాల కారణంగానే ఇరాక్పై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందని నిరసనకారులు తెలిపారు. ఇరాక్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇరాక్లో ఆందోళనలు ఎందుకంటే...
ఇరాక్లోని పలు పట్టణాల్లో అమెరికా సైనిక శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. తద్వారా ఇరాక్ భూభాగం నుంచి మధ్య ప్రాఛ్యంలో నెలకొన్న పరిస్థితులను అమెరికా పరిశీలిస్తున్నది. ఏదేశంతోనైనా ఇరాక్కు యుద్ధం సంభవించినట్టయితే సైనిక సహకారం అందజేస్తున్నది. సైనిక శిబిరాలతో పాటు ఇరాక్ అంతర్గత వ్యవహారాల్లోనూ అమెరికా జోక్యం పెరిగిపోయింది. ఈనెల3న ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమానిని అమెరికా హత్య చేసింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వారులో బయల్దేరిన సులేమాని వాహనంపై క్షిపణుల దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సులేమాని మృతిచెందారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ను ఇరాక్ భూభాగం నుంచే నిర్వహించింది.
సులేమాని హత్య కోసం కొన్ని రోజుల పాటు సెక్యూరిటీ సిబ్బంది రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. కొంత మంది ఇరాక్ పౌరులు కూడా సులేమాని హత్యకు పరోక్షంగా సహకరించారు. ఈ ఘటన అనంతరం మధ్యప్రాచ్యంలో అలజడి చెలరేగింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అమెరికా చర్యలను ఇరాక్ కూడా తప్పుపట్టింది. ఈనెల5న ఇరాక్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. తమ దేశంలోని 5,200 మంది అమెరికా సైనికులను వెనక్కి పంపించాలనే ప్రతిపాదనకు అనుకూలంగా మెజారిటీ ఎంపీలు ఓటు నమోదు చేశారు.
అయితే, ఇరాక్ భూభాగం నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించే అంశంపై మాత్రం అమెరికా ఇంకనూ స్పందించలేదు. ఇక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించినట్టయితే మధ్య ప్రాఛ్యంలో తమ పట్టును కోల్పోయే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.
అంతేగాకుండా, అమెరికా సంకీర్ణదళాలు ఇరాక్ భూభాగం నుంచి వైదొలగినట్టయితే ఉగ్రవాదం పెరిగిపోయే ప్రమాదముందన ట్రంప్ ఊదరగొడుతున్నారు. అల్సద్ర్ నేతృత్వం వహిస్తున్న పార్టీ 2018లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. యూఎస్ బలగాలను వెనక్కి పంపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, శుక్రవారం అల్సద్ర్ తీసిన భారీ ర్యాలీకి ఆయన రాజకీయ ప్రత్యర్థి హదీ అల్అమేరీ మద్దతు తెలపడం గమనార్హం.