Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యాంగాంగ్ : ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిగా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ రిసన్ గ్వాన్ను నియమించనున్నట్టు ఆదేశాధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన కోసం ఆయన గత కొన్నేండ్ల నుంచి బాగా కృషి చేస్తున్నారు. అంతేగాకుండా, అమెరికా-ఉత్తరకొరియా దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరకొరియా అణ్వస్రపరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తున్నది. ఉత్తరకొరియా ఆర్థిక వ్వవస్థను దెబ్బతీసేందుకు ఆదేశంపై భారీ ఆంక్షలు మోపింది. అంతేగాకుండా, ఉత్తరకొరియాలోని అణ్వస్త్ర పరీక్షా కేంద్రాలను మూసివేయాలని హెచ్చరించింది. అయితే, అమెరికా హెచ్చరికలను బేఖాతర్ చేసిన కిమ్ ఖండాతర క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అగ్రరాజ్యం కంటిపై కునుకులేకుండా చేశారు. ఇరుదేశాల మధ్య దక్షిణకొరియా మధ్యవర్తిత్వం వహించి ద్వైపాక్షిక భేటీ ఏర్పాటు చేసింది. తమ దేశంపై మోపిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్టయితే అణ్వస్త్ర పరీక్షలు నిలిపివేయనున్నట్టు కిమ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య రెండు సార్లు కీలక భేటీలు జరిగాయి. అయితే, ఈరెండు భేటీల్లోనూ ఉత్తరకొరియాపై ఆంక్షల ఎత్తివేత అంశం చర్చకు రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను రిసన్ గ్వాన్ తిరిగి గాడిలో పెట్టగలరని కిమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని కిమ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఉత్తరకొరియా, దక్షిణకొరియా దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడంలో రిసన్ గ్వాన్ కీలక పాత్ర పోషించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్న రియాంగ్ హౌకు ఏ బాధ్యతలు అప్పగించనున్నారో తెలియరాలేదు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.