Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో 'మ్యారి యువర్ రేపిస్ట్' బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రతినిధులు
- దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తల ఆందోళన
అంకారా: సమాజంలో మహిళలకు భద్రత పెంచాలనీ, రోజులు మంచిగా లేవంటూ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా టర్కీలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. లైంగికదాడికి పాల్పడిన దోషులను శిక్షల నుంచి రక్షించేందుకు సహకరించేలా 'మ్యారి యువర్ రేపిస్ట్' అనే కొత్త చట్టాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకురానుంది.
ఈ మేరకు జనవరి నెలాఖరులోగా టర్కీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆడ, మగ సమానం అనేది ప్రకృతి విరుద్దమంటూ టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ పలుమార్లు వ్యాఖ్యానించారు. మ్యారి యువర్ రేపిస్ట్ బిల్లు ఆమోదం పొందితే.. దీని ప్రకారం 18ఏండ్ల లోపు యువకులు యువతులపై లైంగిక దాడులకు పాల్పడితే ఆ బాధితురాలిని పెండ్లి చేసుకోవాలి. దీంతో నిందితులకు ఎలాంటి శిక్ష విధించరు. అయితే త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసన మొదలైంది. ఈ బిల్లు మహిళల హక్కులను కాలరాయడంతో పాటు లైంగికదాడులకు ప్రోత్సహించడమే అవుతుందంటూ మహిళా సంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2016లోనే వీగిపోయిన మరో బిల్లు
బాల్య వివాహం, చట్టవిరుద్దమైన లైంగిక దాడులను చట్టబద్ధం చేయడమే కాకుండా లైంగిక దోపిడీకి ఈ చట్టం ఆస్కారమిస్తుందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఆరోపించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టరాదంటూ డిమాండ్ చేసింది. 2016లో కూడా ఇలాంటి బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. టర్కీలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో అది వీగిపోయింది. ఈ బిల్లును ఐక్యరాజ్యసమితి సంస్థలు సైతం తీవ్రంగా తప్పుబట్టాయి. ఇది యువతులపై లైంగికదాడులకు పాల్పడే అవకాశాలను సృష్టిస్తుందనీ, బాధితులను దుండగుల నుంచి మరిన్ని లైంగిక బెదిరింపులను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివక్ష బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు
మహిళలు, బాలికల హక్కులను రక్షించడమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ అయిన మిడిల్ ఈస్ట్.. నార్త్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్లలో సమానత్వాన్ని బోధించే ప్రత్యేకత కలిగిన ప్రచారకుడు సుద్ అబూ-దయ్యే మాట్లాడుతూ.. రాజకీయనాయకులు ప్రయత్నిస్తున్నది ఆందోళనగా ఉందని అన్నారు. పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడేవారికి శిక్ష మినహాయింపును అందించేలా బిల్లును తీసుకురావడం సరైందికాదని చెప్పారు. ఈ వివక్ష బిల్లుకు వ్యతిరేకంగా టర్కీలోని మహిళా హక్కుల ప్రచారకులంతా ధైర్యంగా తమ నిరసన గళాన్ని వినిపించినందుకు వారిని తాను అభినందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
లైంగిక హింసకు గురైన 38 శాతం మహిళలు
టర్కీలో చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 కాగా, బాల్య వివాహంపై 2018 ప్రభుత్వ నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో మొత్తం 4,82,908 మంది బాలికలకు బాల్య వివాహం చేశారు. టర్కీలో మహిళలు, బాలికలపై హింస ప్రబలంగా ఉంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. 38 శాతం టర్కీ మహిళలు భాగస్వామి నుంచి శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారు. 2014 లో ఇస్తాంబుల్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పురుషులు మహిళల మధ్య సమానత్వం ''ప్రకృతికి వ్యతిరేకం'' అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.