Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏను వెనక్కి తీసుకోవాలని మోడీకి బహిరంగ లేఖ
లండన్ : సీఏఏకు వ్యతిరేకంగా భారత్లో ఆందోళన చేస్తున్నవారికి సంఘీభావంగా, రిపబ్లిక్డేను పురస్కరించుకొని వివిధ సంస్థలకు చెందిన దాదాపు 2 వేల మందికిపైగా ప్రజలు లండన్ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత పౌరసత్వం ప్రాతిపదికను మార్చటం, కొత్తరకమైన వివక్ష, రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను మార్చటాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శన జరిగింది. 'యునైటెడ్ ఎగైనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా' పేరుతో లండన్లోని డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ భారత రాయబార కార్యాలయం వరకూ సాగింది. అక్కడి బారికేడ్ ప్రాంతంలో సభ నిర్వహించారు. అనంతరం ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్రమోడీకి బహిరంగ లేఖను విడుదలచేసింది. ఆర్టికల్ 370 రద్దు నుంచి మొదలు అయోధ్య కేసు, జమ్మూకాశ్మీర్లో నాయకుల గృహనిర్బంధం వరకూ, సీఏఏ, ఎన్నార్సీ పేరుతో దేశంలో మతచిచ్చు రేపుతున్న ప్రభుత్వ విధానాలను వారు విమర్శించారు. సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీని డిమాండ్ చేశారు. సౌత్ ఆసియా సాలిడారిటీ గ్రూప్ ప్రతినిధి సర్బిజిత్ జోహాల్ మాట్లాడుతూ.. ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టేలా మోడీ పాలన అడుగులు వేస్తున్నదని విమర్శించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులు, మహిళల సామూహిక ప్రతిఘటన ఉద్యమానికి సంఘీభావ తెలుపుతున్నట్టు చెప్పారు. కాస్ట్వాచ్ యూకే, మలయాళీ ముస్లింల సమన్వయ కమిటీ, ఎస్ఓఏఎస్ ఇండియా సొసైటీ, యూకేలో తమిళ ప్రజల గ్రూపు, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ ముస్లిం ఫెడరేషన్ (యూకే), ఫెడరేషన్ ఆప్ రెడ్బ్రిడ్జ్ ముస్లిం ఆర్గనైజేషన్స్, కాశ్మీర్ సాలిడారిటీ ఉద్యమం, నియంతృత్వానికి వ్యతిరేకంగా దక్షిణాసియా విద్యార్థులు, న్యూహామ్ ముస్లిం అలయన్స్. గదర్ ఇంటర్నేషనల్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.