Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ పర్యాటకోత్సవానికి క్యూబా ఆతిథ్యం
హవానా : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన క్యూబా ఈ ఏడాది మేలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటకోత్సవం ఫిట్ క్యూబా-2020కి ఆతిధ్య మివ్వనున్నది. ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఐవిస్ ఫెర్నాండెజ్ పెనా ఈ సందర్భంగా తెలిపారు. క్యూబాలోనే నెంబర్ వన్ బీచ్ రిసార్ట్గా ఉన్న వరడెరోలో వెయ్యి గదుల హోటల్ కాంప్లెక్ నిర్మాణమవుతున్నదని, దీనిని ఒయాసిస్ టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమిస్తున్నామని ఆయన తెలిపారు. జోసోన్ పార్క్, ప్లాజా అమెరికాల కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా. రీ మోడలింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పర్యాటక నిర్వాకులను, వాణిజ్య ప్రముఖులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. దేశంలోని పర్యాటక రంగ ప్రగతిని కళ్ళకు కట్టినట్టు చూపేందుకు కృషి చేయడమే కాకుండా, దేశ సాంస్కృతిక, సహజ ఆకర్షణలు, నాణ్యమైన సేవలు, భద్రతల ప్రాతిపదికగా అంతర్జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు స్పెయిన్లోని మాడ్రిడ్లో 2018లో జరిగిన 38వ అంతర్జాతీయ పర్యాటకోత్సవంలో పర్యాటక రంగానికి సంబంధించిన సురక్షితమైన ప్రదేశంగా ఎక్స్లెన్స్ అవార్డును క్యూబా పొందింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలకంగా ఉన్న వ్యూహాత్మక పర్యాటక రంగాన్ని అణగదొక్కే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వపు ఆంక్షలు, మీడియా ప్రచారాలు క్యూబాను నిరుత్సాహ పరచలేదు. క్యూబాపై 2017 నుండి అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఇతర దిగ్బంధ ఆంక్షలతో పాటు అమెరికా తీసుకున్న ఈ చర్యలు కారణంగా ఏప్రిల్ 2018-మార్చి 2019 కాలంలో క్యూబాకు 1.383 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అది కూడా ట్రావెల్, సేవా, రవాణా సౌకర్యాల కార్యకలాపాలు వంటి ప్రాధాన్యతా రంగాలలో నష్టం వాటిల్లింది. దిగ్బంధం లేకపోతే క్యూబాను సందర్శించే వార్షిక పర్యాటకుల్లో 35 శాతం మంది అమెరికాకు చెందిన వారే వుంటారని అంచనా.