Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డమాస్కస్: తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న అలెప్పో నగరాన్ని సిరియా సైన్యం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది. 2016లో రెబల్స్ ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నగరం తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ సేనలకు మధ్య ప్రధానమైన రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న భీకరపోరులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గత రెండు నెలలుగా రష్యా మద్దతుతో సిరియా సైన్యం రెబల్స్పై విస్తృత స్థాయి సైనిక చర్య ప్రారంభించి ఇద్లిబ్ ప్రావిన్స్ను ఇప్పటికే తన స్వాధీనం చేసుకుంది. ఈ విజయోత్సాహంతో ముందడుగు వేసిన సిరియా సైన్యం అలెప్పో నగరం నుంచి తిరుగుబాటుదారులను తరిమికొట్టి పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రెబల్స్ 2012లో మూసివేసిన ఇద్లిబ్-అలెప్పో జాతీయ రహదారి సేవలను పునరుద్ధరించనున్నట్టు వెల్లడించింది. తమ సైనిక చర్య ఫలితంగా అలెప్పో పరిసర ప్రాంతాలలోని అనేక గ్రామాలు, పట్టణాలు తమ స్వాధీనంలోకి వచ్చాయని సిరియా సైన్యం తన ప్రకటనలో వివరించింది. అలెప్పో పశ్చిమ ప్రాంతంలో ఇంకా తమ ఆపరేషన్ కొనసాగుతోందని, కొద్దిరోజుల్లోనే దానికి కూడా తెరదించుతామని తెలిపింది. సైనిక చర్య ముగిసిన సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద మాట్లాడారు. సిరియా సైన్యం అలెప్పో నగరంలోని తిరుగుబాటుదారులను తరిమివేసిందన్నారు. అలెప్పో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నంత మాత్రాన యుద్ధం ముగిసినట్టో లేదా ఉగ్రవాదాన్ని నిర్మూలించినట్టో కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయం రెబల్స్పై సంపూర్ణ విజయానికి తమకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.