Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రతిపాదిస్తున్న పెన్షన్ సంస్కరణల బిల్లు ముసాయిదాపై ఫ్రాన్స్ పార్లమెంట్ సోమవారం విస్తృత స్థాయిలో చర్చించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో పార్లమెంట్ దీనిపై చర్చను ప్రారంభించటం గమనార్హం. ఈ బిల్లును గట్టిగా సమర్ధించిన కొత్త ఆరోగ్య శాఖ మంత్రి ఆలివర్ వెరాన్ మాట్లాడుతూ ఇది సామాజిక భద్రతకు మూల స్తంభం లాంటిదని అన్నారు. ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అయితే చర్చకు కొంత సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 42 రంగాలకు వర్తిస్తున్న పెన్షన్ విధానం స్థానంలో అందరికి వర్తించే పాత నిబంధనలతోనే పాయింట్ల ఆధారిత పెన్షన్ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.ఆర్ఏటీపీ, ఎన్ఎన్సీఎఫ్ వంటి ప్రభుత్వ రంగ రవాణా సంస్థల ఉద్యోగులకు నిర్దేశిత పదవీ కాల నిబంధనను తొలగించాలని ఇందులో ప్రతిపాదించారు. కొత్త విధానం ప్రకారం పనిచేసే ప్రతి గంటకూ పెన్షన్ హక్కులకు నిర్దేశించిన పాయింట్లు జతవుతాయి. గత ప్రభుత్వాలన్నీ అత్యంత ధైర్యంతో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లారని, అయితే బడ్జెటరీ కారణాలతో అవి వెనుకంజ వేశాయని పెన్షన్ సంస్కరణల శాఖ మంత్రి లారెంట్ పీట్రాస్జెవీస్కి చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ విధానం పెన్షన్ సంస్కరణలపై చెలరేగుతున్న వివాదాలకు తెరదించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రతిపాదించిందన్నారు. ముఖ్యంగా కార్మికుల్లో అధికశాతం మంది వ్యతిరేకిస్తున్న 64 ఏండ్ల వయో పరిమితిని తాత్కాలికంగా తొలగించటం. దీనిపై కార్మిక సంఘాల నేతలు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న వేసవిలో ఈ సంస్కరణల చట్టంపై ఓటింగ్ జరగటానికి ముందే ఈ వయో పరిమితి నిబంధనను తిరిగి ప్రతిపాదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇవి పెన్షన్ విధానాన్ని ప్రక్షాళన చేసే పేరుతో అధ్యక్షుడు మాక్రాన్ ప్రతిపాదిస్తున్న పెన్షన్ విధానంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ప్రతిపాదనలు మాత్రమేనన్న విమర్శ వినిపిస్తోంది. ఈ బిల్లు చట్టం కాకుండా అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలన్నీ చేస్తామని 'ఫ్రాన్స్ అన్బౌడ్' పార్టీ నేత జీన్లక్ మెలెకాన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ దిగువసభలో ఈ బిల్లుపై వాడీవేడీ చర్చ జరుగుతుంటే మరోవైపు, కార్మిక సంఘాలు ఈ బిల్లును ఎదుర్కొనేందుకు తమ ఆందోళనను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 20న దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు కార్మిక సంఘాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
గత రెండు నెలలుగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, డ్రైవర్లు, పోలీసులు, విద్యార్థులు సైతం ఈ పెన్షన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వరుసగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.