Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్
- గ్రీస్లో దేశవ్యాప్త సమ్మె, నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు కార్మిక సంఘాల ఆందోళనలకు
- గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు
ఏథెన్స్ : గ్రీస్ కార్మిక సంఘాలు కదం తొక్కాయి. సామాజిక భద్రతను ప్రయివేటికరించాలని గ్రీస్ సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు ఓ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని భారీ ర్యాలీలు తీశారు. కార్మిక సంఘాల నిరసనల నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యా, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. దేశ ప్రజలు స్వచ్చంధంగా కార్మికులకు మద్దతు తెలిపారు.ఓడరేవుల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా సమ్మెకు మద్దతుగా నిలిచారు. కార్మిక సంఘాలు తీసిన ర్యాలీలకు గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. కార్మిక సంఘాల పక్షాన నిలిచి ఆందోళనలను ముందుకు నడిపించింది. ప్రభుత్వం తక్షణమే సామాజిక భద్రత ప్రయివేటీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం..గ్రీస్లోని 60 ప్రధాన నగరాల్లో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ డీమిత్రీస్ కౌట్సవూంప మాట్లాడుతూ సామాజిక భద్రతను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. పదవీ విరమణ వయసును కూడా 67ఏండ్లకు పెంచాలని యోచిస్తున్నది. తద్వారా వయసు పైబడిన కార్మికులు కూడా ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయని అన్నారు. పెన్షన్ ఆలస్యంగా లభిస్తుందన్నారు. గ్రీస్ కార్మిక శాఖ మంత్రి ఇయానిస్ బ్రౌట్సిస్ సామాజిక భద్రత ప్రయివేటీకరణకు సంబంధించి ఓ బిల్లును ప్రతిపాదించారు. దీన్ని అధికార కన్జర్వేటివ్ న్యూ డెమోక్రసీ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టంగా మారినట్టయితే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. నూతన పరిశ్రమల స్థాపనకు అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆల్వర్కర్స్ మిలిటంట్ ఫ్రంట్ అనే కార్మిక సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది.నిరసన కార్య క్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నది. కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలకు స్థానిక పార్టీలు సంఘీభావం తెలిపాయి. పలు కార్పొరేట్ సంస్థకు లబ్ది చేకూరే విధంగా ఉద్యోగులకు అందజేసే ఇన్యూరెన్స్ విధానంలోనూ సమూల మార్పులను తీసుకురావాలని గ్రీస్ ప్రభుత్వం ప్రయత్ని స్తోందని డీమిత్రీస్ విమర్శించారు. ఉద్యోగులకు అందజేసే ప్రయోజనాలను తగ్గించాలని కుట్ర పన్నిందని అన్నారు. కాగా, గ్రీస్ కార్మిక సంఘాలు తీసిన ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు ఐరోపాలోని యూఎస్బీ ఇటాలియా, ఫ్రాన్స్ లోని సీజీటీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.