Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: పాకిస్థాన్ను గ్రే లిస్టులోనే కొనసాగించనున్నట్టు అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) వెల్లడించింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నియంత్రించలేకపోవడంపై పారిస్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీలో పాక్కు హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నాటికి తమ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు అందే నిధులను నియంత్రించలేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రసంస్థల నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు కొత్తగా మరో 8 అంశాలతో కూడిన లక్ష్యాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ముందుంచింది. 2018, అక్టోబర్లో ఎఫ్ఏటీఎఫ్ తొలిసారి పాక్ను గ్రే లిస్ట్లో చేర్చింది. 15 నెలల సమయం ఇచ్చినప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ విఫలమైంది. దీంతో మరోసారి ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైన నేపథ్యంలో బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పదని హెచ్చరించింది. తాజాగా నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఇమ్రాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస గుర్తించిన ఉగ్రసంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు నిరూపించాల్సి ఉంటుంది. పారిస్లో ఎఫ్ఏటీఎఫ్ సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్కు 11ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ పాక్ కోర్టు తీర్పు వెలువరించింది. మరికొంత మందిని కూడా అరెస్టు చేసింది. అయితే ఇవన్నీ కంటితుడుపు చర్యలేనని భారత్ కొట్టిపారేస్తూ వచ్చింది. బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పించుకోవడానికే పాక్ ఇలాంటి తాత్కాలిక చర్యలు తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.