Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి: అమెరికా
వాష్టింగన్: భారత్, అమెరికాలతో మెరుగైన సంబంధాలు ఏర్పార్చుకోవాలంటే.. ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది. ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో వైట్హౌస్ అధికారులు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని ఈ విషయాన్ని గతంలోనే అనేకసార్లు స్పష్టం చేసినట్టు తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతం కావాలంటే.. ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలనీ, అలాగైతే.. ఇరుదేశాల మధ్య చర్చలు సక్సెస్ అవుతాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. గతేదాడి ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయనీ, ఈ సమస్యను పాకిస్థాన్ అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందనీ, కానీ భారత్ మాత్రం.. తమ అంతర్గత విషయమని నొక్కి చెప్పిందని గుర్తుచేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి అమెరికా ప్రయత్నిస్తుందనీ, ఇరుదేశాల మధ్య పరస్పరం ద్వైపాక్షిక చర్యలు జరిగేలా.. అమెరికా మధ్యవర్తిత్వం వహించనున్నదని వైట్హౌస్ సీనియర్ అధికారి తెలిపారు.
భారత పర్యటన సందర్భంగా కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. కాశ్మీర్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించకపోవచ్చు.. కానీ, ఉద్రిక్తతలకు తావులేకుండా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించి శాంతి, సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్ ను 'గ్రే లిస్ట్'లో మరో నాలుగు నెలలు నిలుపుకున్న తరువాత వైట్హౌస్ అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్లోగా పాకిస్థాన్ గ్లోబల్ టెర్రర్ యాంటీ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ నుంచి 27అంశాల మేరకు పాక్ కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయాలి లేదా ఆ దేశం 'బ్లాక్ లిస్ట్'లోకి నెట్టివేయబడుతుంది.
ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపనకు సాగుతున్న ప్రయ త్నాల గురించి ఆయనను ప్రశ్నించగా.. ప్రాంతీయ దేశాలలో శాంతిప్రక్రియకు మద్దతు ఇవ్వాలని భారత్ను ప్రోత్సహించామనీ, ఆ ప్రయత్నం విజయవంత మయ్యిందన్నారు. గత 19 ఏండ్లుగా సైనిక, దౌత్య, ఆర్థిక సహాయం అక్కడ కొనసాగుతున్నదనీ, త్వరలో సైన్యాన్ని వెనక్కు రప్పించబోతున్నట్టు వివరించారు.
అయితే, సైనిక సాయాన్ని ముగించినా గత 19 ఏండ్లుగా ఉన్న దౌత్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తాం. ఈ ప్రాంతంలో ముఖ్యమైన దేశం కాబట్టి అఫ్ఘాన్ శాంతి ప్రక్రియకు మద్దతు విషయంలో కచ్చితంగా భారత్ సాయం కోరతాం.. స్థిరత్వానికి కీలకం.. ఒకవేళ దీని ప్రస్తావన వస్తే ట్రంప్ తప్పకుండా అభ్యర్థిస్తారని అన్నారు.