Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి, వందలాది మంది గల్లంతు
ఇస్తాంబుల్: టర్కీ తూర్పు ప్రాంతంలో ఇరాన్ సరిహాద్దుల వద్ద ఆదివారం సంభవించిన భూకంపంలో కనీసం 8 మంది మరణించారని, వందలాది మంది గల్లంతయ్యారని టర్కీ హోం మంత్రి సులేమాన్ సొయిలు చెప్పారు. మృతులలో ముగ్గురు చిన్నారులున్నారని ఆయన చెప్పారు. మరికొంత మంది ప్రజలు శిధిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోవున్న వాన్ ప్రావిన్స్లోని అనేక గ్రామాలు ఈ భూకంపానికి ధ్వంసమైన చిత్రాలను టర్కీ టీవీ ప్రసారం చేసింది. సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు క్రేన్లు, ఎక్స్కవేటర్ల సాయంతో శిధిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ భూకంపంలో 21 మంది గాయపడ్డారని, అందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రి ఫహ్రీటిన్ కోకా చెప్పారు.
ఆదివారం ఉదయం 9.23 గంటల సమయంలో ఇరాన్ సరిహద్దు నుండి 10 కి.మీ లోపులో వున్న హబాష్ ఎ ఓల్యా గ్రామంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధనా విభాగం వెల్లడించింది. ఈ ప్రకంపనల కేంద్రం భూగర్భంలో ఆరు కి.మీ లోతులోవుందని టెహ్రాన్ యూనివర్శిటీ భూగర్భ శాస్త్ర పరిశోధనల కేంద్రం వెల్లడించింది.