Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక నిర్ణయం
కొలంబో: తమిళ పులులతో జరిగిన పోరులో లంక సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ 2015లో ఐరాస మానవ హక్కుల మండలి ప్రతిపాదించిన తీర్మానం నుంచి తాము తప్పుకుంటున్నామని శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్ గుణవర్ధన ప్రకటించారు. బుధవారం జరిగే మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమిళ పులులతో కొనసాగిన పోరులో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపించాలంటూ ఐరాస మానవ హక్కుల మండలి ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్ వంటి 11 దేశాలతో పాటు శ్రీలంక కూడా సమర్ధించింది. బుధవారం మండలి భేటీ జరుగనున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి రవినాధ ఆర్యసింహ మండలి అధ్యక్షురాలు ఎలిజెబెత్ టిచీ ఫిసిల్బెర్గర్కు వివరించారని లంక విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వివరించింది. దీనితో పాటు ఐరాస మానవ హక్కుల కమిషనర్కు కూడా గుణవర్ధన ఈ నిర్ణయాన్ని తెలియచేస్తారని తెలిపింది. పులులపై పోరులో మానవ హక్కులను ఉల్లంఘించిన ఆరోపణలపై లంక సేనాధిపతి లెఫ్టినెంట్ జనరల్ శవేంద్ర సిల్వా, ఆయన కుటుంబ సభ్యులపై అమెరికా పర్యాటక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ తీర్మానం నుంచి తప్పుకోవాలని లంక సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.