Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా కాటుకుఒక్కరోజులోనే 139 మంది మృతి
- ఔషధాల అక్రమ నిల్వలపై ట్రంప్ కొరడా
వాషింగ్టన్: కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాలో కూడా మరణమృదంగం మోగిస్తోంది. తొలిసారిగా సోమవారం ఒక్కరోజే దేశంలో 139 మంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో చనిపోవటంతో.. మొత్తం మృతుల సంఖ్య 550కి చేరింది. సోమవారం దాదాపు పదివేలకు పైగా కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,700 దాటింది. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు అవసరమైన ఔషధాలు, వైద్యపరికరాల అక్రమ నిల్వలపై కొరడా ఝళిపిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ఔషధాలు, వైద్య పరికరాలు అక్రమంగా నిల్వ చేసినా, అధికధరలకు విక్రయించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. 'అనారోగ్యంతో బాధపడే అమెరికన్ల నుంచి లాభాల వేట కొనసాగించే వారిని ఉపేక్షించబో'మని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించి మోసపూరిత చర్యలకు పాల్పడితే వారిని న్యాయశాఖ నిర్దాక్షిణ్యంగా ప్రాసిక్యూట్ చేస్తుందన్నారు. కరోనావైరల్ ఇన్ఫెక్షన్లకు న్యూయార్క్ రాష్ట్రం, ముఖ్యంగా న్యూయార్క్ నగరం కేంద్ర స్థానంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కరోనా కేసుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు న్యూయార్క్ నగరానికి చెందిన వారేనని లెక్కలు చెబుతున్నాయి. సోమవారం న్యూయార్క్ నగరంలో 5,085 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య 20,875కు చేరింది. న్యూయార్క్ నగరంలో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇప్పటి వరకూ 157 మంది మరణించారు. సోమవారం ఒక్క రోజే 43 మరణాలు నమోదయ్యాయి.