Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చైనా వైరస్ ఆరోపణలపై ఆ దేశం ఖండన
- తాము సృష్టించలేదని వెల్లడి
బీజింగ్ : ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్-19 తమ సృష్టి కాదని చైనా మరోసారి స్పష్టం చేసింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు మరికొన్ని దేశాలూ రాద్దాంతం చేస్తుండటంతో చైనా అసహనం వ్యక్తం చేసింది. కరోనాను 'చైనా వైరస్' అంటూ అనవసరంగా తమపై నిందలు మోపొద్దని కోరింది. కరోనాను సృష్టించింది తాము కాదనీ, అంతేగాక ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చెందించామనడం కూడా సరైనది కాదని చైనా విదేశాంగ ప్రతినిధి జి రాంగ్ వెల్లడించారు. ఈ మేరకు రాంగ్ మాట్లాడుతూ... ఈ వైరస్ను ముందుగా వూహాన్లో గుర్తించినప్పటికీ ఇది తమ దేశమే తయారుచేసిందనడానికి శాస్త్రీయమైన ఆధారాలేమీ రుజువు కాలేదని చెప్పారు. ఆ మహమ్మారి మూలానికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు. దాని కారణంగా చైనా ప్రజలూ ప్రాణాలు కోల్పోయారనీ, లక్షలాది మంది వారి సామాజిక జీవితాలను త్యాగం చేసి, దాదాపు నాలుగు నెలల పాటు శ్రమించి దాన్ని అదుపులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని రాంగ్ తెలిపారు. ఈ వైరస్ నివారణలో భారత్కు తమ పూర్తి సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19 ను గుర్తించినప్పుడు భారత్ తమకు సహాయసహకారాలు అందించిదనీ, అందుకు భారత్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. అలాగే భారత్ కూడా ఈ వైరస్ను 'చైనా వైరస్' అని పిలవడం మానుకోవాలనీ, ఇది ఇరు దేశాల సంబంధాల మధ్య ప్రభావం చూపుతుందని రాంగ్ తెలిపారు.