Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమల్లోవాడే మందు తాగి 300 మందికి పైగా మృతి!
- ఇరాన్లో దారుణం..
టెహ్రాన్: కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇండిస్టియల్ ఆల్కహాల్ (మిథనాల్)ను సేవించిన ఘటనలో ఇరాన్లో దాదాపు 300 మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో వెయ్యిమందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఇరాన్ మీడియా వివరించింది. ఇరాన్లో మద్యపానంపై నిషేధం వుండటంతో దానికి అలవాటు పడిన కొంతమంది ఇండిస్టియల్ ఆల్కహాల్ను వినియోగిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా ఇది నివారిస్తుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ప్రజలు మూకుమ్మడిగా ఈ మెథనాల్ వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ వైరస్ ప్రజల్లో విస్తరిస్తూ వారి ప్రాణాలను బలి తీసుకుంటోందనీ, దీనికి బలయ్యే వారంతా ఇందుకు సంబంధించిన ఇతర ప్రమాదాలపై తక్కువ అవగాహన కలిగి వున్నట్టు తాను భావిస్తున్నానని ఓస్లోకు చెందిన ప్రముఖ క్లినికల్ టాక్సికాలజిస్ట్ డా.నట్ ఎరిక్ హౌడా అభిప్రాయపడ్డారు. మిథనాల్ను నిరంతరాయంగా సేవిస్తుండటంతో వారి శరీరాలు విషపూరితంగా మారిపోతున్నాయని ఆయన చెప్పారు. అధికశాతం మంది ప్రజల్లో కరోనా వైరస్ సోకిన తొలిదశలో ఎలాంటి లక్షణాలూ వుండవు. రెండు మూడు వారాల తరువాత దగ్గు, జ్వరం వంటి లక్షణాలు బయటపడతాయి. కొంతమంది వృద్ధులై, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి న్యూమోనియా వంటి తీవ్ర అస్వస్థతకు దారి తీసి మరణం సంభవించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఎనిమిది కోట్లకు పైగా జనాభా వున్న ఇరాన్ వంటి దేశాలలో ఇది తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తు తానికి కోవిడ్-19గా పిలవబడుతున్న కరోనా వైరస్తో ఎదురయ్యే అనారోగ్యానికి ఎలాంటి చికిత్సా అందుబాటులో లేదు. ఈ వైరస్ను సమర్ధవంతంగా తిప్పికొట్టే ఔషధాలు, వ్యాక్సిన్లను వినియోగంలోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ఖాతాలలో వెల్లువెత్తుతున్న బోగస్ సందేశాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విస్కీలో తేనె వేసుకుని తాగితే కరోనా వైరస్ దరి చేరదంటూ తప్పుడు సందేశాలే ప్రాణాల మీదకు తెస్తున్నాయి.