Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ వ్యాప్తంగా 24,057కు పెరిగిన మృతుల సంఖ్య
వాషింగ్టన్: అన్ని రంగాలలో అగ్రదేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా..కరోనా ఇన్ఫెక్షన్ కేసుల నమోదులో కూడా తన పేరును నిలుపుకుంటోంది. ఒక్క రోజులోనే దాదాపు 16,000కు పైగా కరోనా కేసులు నమోదు కావటంతో ఈ విషయంలో ఇప్పటి వరకూ ముందున్న చైనా, ఇటలీలను అమెరికా అధిగమించింది. తాజా కేసులతో అమెరికాలో నమోదైన మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 85,600 దాటిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్తో మరణించిన వారి సంఖ్య 24,087కు చేరగా ఇందులో 8,215 మృతులతో ఇటలీ అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాలలో స్పెయిన్ (4,635), చైనా (3,169) నిలిచాయనీ ఈ లెక్కలు వివరిస్తున్నాయి. మొత్తం 85,063 కరోనా ఇన్ఫెక్షన్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా 81,782 కేసులతో చైనా, 80,589 కేసులతో ఇటలీ తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయని హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. వరల్డోమీటర్ అనే వెబ్సైట్ లెక్కల ప్రకారం గురువారం ఒక్కరోజే దేశంలో 16,877 కేసులు నమోదు కావటంతో ఈ సంఖ్య 85 వేలు దాటిందని తెలుస్తోంది. వారం రోజుల క్రితం అమెరికాలో నమోదైన ఈ కేసుల సంఖ్య కేవలం 8,000 మాత్రమే. కాగా, కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ సంఖ్య పదిరెట్లకు పైగా పెరిగిపోవటం ఈ వైరస్ వ్యాప్తి ప్రమాద తీవ్రతను సూచిస్తోందని వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో 263 మంది అమెరికన్లు మరణించారనీ, దీనితో ఇప్పటి వరకూ నమోదైన మృతుల సంఖ్య 1,290కి చేరుకున్నదని ఈ వెబ్సైట్ వెల్లడించింది. కరోనా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన వారిలో 2 వేల మందికి తీవ్ర స్థాయిలో వుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నిర్ధారిత ఇన్ఫెక్షన్ కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఈ వెబ్సైట్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వున్న ప్రధాన ఆస్పత్రులు, లేబరేటరీలు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఫెడరల్ ఎమర్జెన్సీ ఏజెన్సీలకు అందుబాటులో వుండాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సూచించారు. దేశ ప్రజలు కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందవద్దనీ, అలానే నిర్లక్ష్యంగా కూడా వుండవద్దని వైట్హౌస్ కరోనా టాస్క్ఫోర్స్ సభ్యురాలు దెబోరా బ్రిక్స్ సూచించారు. అత్యవసరమైన వైద్య సరఫరాలకు ఎలాంటి కొరత వుండదని ఆమె స్పష్టం చేశారు.