Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహన్నెస్బర్గ్ : కరోనా వైరస్ను అరికట్టేందుకు దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికా దేశాలు చేపట్టిన చర్యలు హింసాత్మకంగా మారాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు విధించిన కర్ఫ్యూ నిషేధాజ్ఞలను ధిక్కరించిన ప్రజలు రోడ్డెక్కటంతో పోలీసులు పలు ప్రాంతాలలో బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అనేక ప్రాంతాలలో పోలీసులు ప్రజలపై లాఠీ ఝళిపించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన దాదాపు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్డౌన్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిని కట్టడి చేసేందుకు దక్షిణాఫ్రికా సైన్యం కూడా కొన్ని ప్రాంతాలలో రంగంలోకి దిగింది. తమ దేశంలో ఇద్దరు వ్యక్తులు పోలీసు కాల్పుల్లో మరణించినట్టు వచ్చిన వార్తలను రువాండా ప్రభుత్వం ఖండించింది. కెన్యా, జింబాబ్వే తదితర దేశాలలో ఉల్లంఘనులపై పోలీసులు చేపట్టిన చర్యలను ఆయా ప్రాంతాల మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఈయూపై ఇటలీ ఆగ్రహం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో యూరోపియన్ యూనియన్ నిర్వాకంపై ఈ కూటమిలో సభ్య దేశమైన ఇటలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలో కరోనాను అరికట్టేందుకు పోరాడుతుంటే మార్షల్ ప్లాన్ వంటిదేదీ ఈయూ పరిశీలనలో లేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ చేసిన ప్రకటనపై ఇటలీ ఆర్థిక మంత్రి రాబర్ట్ గెయి లవేరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా పెద్ద తప్పిదానికి పాల్పడ్డారని ఇటలీ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పశ్చిమ యూరపు పునర్నిర్మాణానికి అమెరికా ఆధ్వర్యంలో చేపట్టిన మార్షల్ ప్లాన్ చారిత్రికంగా ప్రసిద్ధి పొందిందని, అటువంటి మార్షల్ ప్లాన్ను ఇప్పుడు ఇయు ప్రకటించాలని ఇటలీ కోరుతోంది.