Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల వాణిజ్య కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున లే ఆఫ్లు ప్రకటిస్తారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హెచ్-1బీ వీసాలు కలిగివున్న విదేశీ సాంకేతిక నిపుణులు ట్రంప్ ప్రభుత్వానికి ఒక పిటిషన్పెట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఉద్యోగం పోయిన తర్వాత అమెరికాలో వుండే కాలపరిమితిని ప్రస్తుతమున్న 60 రోజుల నుండి 180 రోజులకు పెంచాలని వారు కోరుతున్నారు. ఇమ్మిగ్రెంట్ యేతర వీసా కేటగిరీలోకి వచ్చే ఈ హెచ్-1బీ వీసా కింద అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులైన విదేశీయులను తమ ఉద్యోగులుగా నియమించు కోవచ్చు. దీంతో ప్రతి ఏటా భారత్, చైనాల నుంచి వేలాదిమంది ఉద్యోగులను సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకుంటూ వుంటాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం, ఒకవేళ ఉద్యోగం గనుక పోయినట్లైతే సదరు వ్యక్తి తన కుటుంబంతో సహా60 రోజుల్లోగా అమెరికా వదిలి వెళ్ళాల్సి వుంటుంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో అమెరికాలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున లే ఆఫ్ ప్రకటించే అవకాశం వున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 21తో ముగిసిన వారానికి రికార్డు స్థాయిలో 33లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం పోయిందని దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రెండు వారాల్లో కరోనా సంక్షోభం మరింత ముదిరే అవకాశం వుండగానే ఇప్పుడే లక్షలాదిమంది నిరుద్యోగులయ్యారు. దాదాపు 47లక్షల మంది నిరుద్యోగులుగా మారే అవకాశం వుందని భావిస్తున్నారు. హెచ్-1బీ వీసాలు కలిగివున్నవారు నిరుద్యోగ భృతికి, సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు కారు. ఇప్పటికే కొంతమంది హెచ్-1బీ ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. మరికొంతమందికి త్వరలో తీసివేసే అవకాశాలు వున్నాయని ఇప్పటికే యాజమాన్యాలు తెలియచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్-1బీ వీసాదారులు వైట్హౌస్ వెబ్సైట్లో పిటిషన్ పెట్టారు. ఒకవేళ ఉద్యోగం పోయినా కనీసం ఆరు నెలలవరకు వుండేందుకు అనుమతించాలని కోరారు. ఇప్పటివరకు ఈ పిటిషన్పై 20వేల మందికి పైగా సంతకాలు చేశారు. వైట్హౌస్ నుంచి ప్రతిస్పందన రావాలంటే కనీసం లక్ష సంతకాలు కావాలి. ఇక ట్రంప్ నిర్ణయంపై ఆధారపడిఉంటుందని పలువురు అంటున్నారు.