Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ నిర్లక్ష్యమే.. కరోనా కాటు
- నెలరోజుల సమయం వృథా
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. అమెరికాలో వైరస్ కల్లోలమే సృష్టిస్తున్నది. ఇప్పటివరకూ ఆ దేశంలో లక్షా 74 వేల 697 మంది వైరస్ బారినపడగా.. 3400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే చెబుతున్నారు. అయితే, ఆర్థికంగా, వైద్యరంగంలోనూ పటిష్ట స్థితిలో ఉన్న అమెరికాలో ఇలాంటి భయా నక పరిస్థితులు నెలకొన డానికి వైట్హౌస్ అధినేత అలసత్వమే అసలు కారణం గా తెలుస్తున్నది. సరైన సమయంలో కాలయాపన చేయకుండా ఉండి వుంటే ఇంతటి ప్రాణనష్టం జరిగేది కాదని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం కరోనా వైరస్పై చర్యలు తీసుకునేందుకు ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. రెండు రోజులకు ఒకసారి వైట్హౌస్ లో సమావేశమై.. చైనాలోని వుహాన్ నుంచి అమెరి కన్లను ఎలా వెనక్కి తేవాలి? చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ఎలా కట్టడి చేయాలి? డైమండ్ ప్రిన్సెస్ లాంటి ఓడల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి? అని మాత్రమే ఎక్కువ సమయం చర్చించి, స్వదేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మమ అనిపించిందని సంబంధిత బృందంలోని సభ్యులు సెలవిస్తున్నారు. అమెరికాలోని మెట్రోరైళ్లలో ప్రతి రోజూ 50 లక్షలమందికి పైగా ప్రయాణిస్తుంటారు. ఇవి కాక బీచ్ లు, పర్యాటక, సందర్శన ప్రాంతాల్లో జనం రద్దీగా తిరు గుతుంటారు. కరోనా చైనా దేశానికే పరిమితమవుతుందని అమెరికా భావించింది. అందుకే అంటువ్యాధుల కట్టడి, నివారణ సంస్థవారు ఒక పరీక్ష కిట్ నమునా తయారు చేశామని తమకు భరోసా ఇచ్చారంటూ చేతులు దులుపుకున్నారు. మొదటి మెట్టుగా ఆ కిట్ వినియోగంలోకి తేస్తామనుకున్నారు. కానీ అలా జరగలేదు. చైనా నుంచి వైరస్ అతి వేగంగా అమెరికాకు విస్తరించింది. జనవరి చివరి నుంచి మార్చి మొదటి వారం మధ్య వేగంగా వ్యాపించింది. అయితే, భారీ సంఖ్యలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపి ఉండాల్సింది కానీ, అలా జరగలేదు. దానికి సాంకేతిక కారణాలు, చట్టపరమైన అనుమతులు లేవనీ, వివిధ స్థాయిల్లో ఉద్యోగుల అలసత్వం, ''ఏంకాదులే'' అనే ఉదాసీన వైఖరి.. ముఖ్యంగా స్పష్టమైన నాయకత్వం లోపించిందనీ అమెరికాలోని సైంటిస్టులు, మేధావులు చెబుతున్నారు. ఈ అలసత్వం వల్ల విలువైన ఒక నెల రోజుల సమయాన్ని అమెరికా నష్టపోవడంతో పాటు జరగకూడని స్థాయిలో ప్రాణనష్టం జరిగిందనేది స్పష్టమవుతున్నది. అత్యంత సంపన్నమైన.. అగ్రరాజ్యంగా కొలిచే అమెరికా వద్ద డబ్బులకు కొదవలేదు. ప్రపంచంలో అత్యంత నైపుణ్యం గల డాక్టర్లు ఉన్నారు. వైద్య, విజ్ఞాన శాస్త్ర రంగ నిపుణులకూ కొరత లేదు. అయినా జరగాల్సిన పరీక్షలు జరగలేదు. ఇప్పుడు ఎన్ని సాకులు చెప్పుకుంటే ఏమి ప్రయోజనం అన్న చర్చనడుస్తున్నది. ట్రంప్ ప్రభుత్వ మొండితనం, వైరస్ను తక్కువగా అంచనా వేయడం, పరీక్ష కిట్లను సరైన సమయంలో సమకూర్చుకోక పోవడం, ఉన్న నైపుణ్యాలను, వైద్య సదుపాయాలను వినియోగించుకోకపోవడమే ఈ మహమ్మారి విజృంభించడానికి కారణం. ఇది అందరికీ గుణపాఠం కావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.